తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 8:57 AM IST

ETV Bharat / state

ఒకే కుటుంబంలో 31 కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. బాధితుల నుంచి వేగంగా ఇతరులకు సోకుతోంది. ఇటీవల కరోనాతో మృతి చెందిన హైదరాబాద్​ పాతబస్తీకి చెందిన ఓ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పరీక్షించగా సుమారు 31 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.

31 corona positive cases found in same family
ఒకే కుటుంబంలో 31 కేసులు

పాతబస్తీలోని తలాబ్‌కట్టకు చెందిన ఓ వృద్ధురాలి ద్వారా మొత్తం 34 మందికి కరోనా సోకినట్లు లెక్క తేలింది. 33 మందిలో నిర్ధారించగా ఒక వైద్యురాలికి సోకిన విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ నెల పదో తేదీన తలాబ్‌కట్టకు చెందిన వృద్ధురాలు పురానిహవేలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆమె మరో మూడు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారు. ఆమె చనిపోయే ముందు కరోనా లక్షణాలు బయటపడటంతో శాంపిళ్లు తీసి గాంధీ ఆసుపత్రికి పంపారు.

ఇంతలో ఆమె ఆరోగ్యం విషమించడం వల్ల మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆసుపత్రిలో వైద్యులతోపాటు నర్సులను క్వారంటైన్‌కు తరలించారు. అందరి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. రెండు రోజుల క్రితం తొలుత ఆమె ద్వారా 13 మందికి పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. తాజాగా శుక్రవారం మరో 17 మందిలో వైరస్‌ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మొత్తం మృతురాలి కుటుంబ సభ్యులే 31 మంది ఉన్నారు. ఆమెకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రి స్టాఫ్‌ నర్సులకు కూడా కరోనా ఉన్నట్లు తేలిందన్నారు. ఒక వైద్యురాలికి కూడా పాజిటీవ్‌ వచ్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వైద్యురాలి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులందరినీ గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇందులో మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు...ఎంతమందిని కలిశారు...అనేది కీలకంగా మారింది. వారందర్ని గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details