కరోనా రెండోదశ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి. శుక్రవారం శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 30 సర్వీసులు రద్దు అయ్యాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను నిలిపివేశారు. దిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో లాక్డౌన్ అమల్లో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
శంషాబాద్ నుంచి 30 విమానాల రాకపోకలు బంద్ - తెలంగాణలో కరోనా వార్తలు
కరోనా ఉద్ధృతి కారణంగా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్డౌన్ ప్రభావం విమానయానంపై పడింది. గతేడాది లాక్డౌన్ తర్వాత నిబంధనలు సడలించడంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 78 శాతం సర్వీసులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తూ.. 14 రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు. దీంతో ప్రయాణికులు వెనక్కి తగ్గుతున్నారు. దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులపైనా ఈ ప్రభావం పడింది. ఇప్పటికే వివిధ దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లండన్, దుబాయి, షార్జా సర్వీసులు రద్దు అయ్యాయి.
ఇదీ చూడండి:నేటి నుంచి కరోనా టీకా మొదటి డోసు నిలిపివేత