TSPSC Paper Leakage Case Updates : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్లను రెండోసారి రెండోరోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం నిన్న సిట్ కార్యాలయంలో విచారించిన అధికారులు.. నేడు మరికొందరిని విచారిస్తున్నారు. ఇదే కేసులో ఏ3 నిందితురాలుగా ఉన్న రేణుక సొంత మండలానికి చెందిన తిరుపతయ్యను అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరికొందరు అనుమానితులను సైతం సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
100కి పైగా మార్కులొచ్చిన వారి వివరాల సేకరణ..:లీకేజీ కేసు విచారణలో భాగంగా డాక్యా నాయక్, రాజేశ్వర్లను హైదరాబాద్లో బస చేసిన హోటల్కు తీసుకెళ్లి సిట్ అధికారులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కలు సాధించిన కొంత మంది అభ్యర్థుల వివరాలను సేకరించి వారిని సిట్ అధికారులు నిన్న విచారించారు. వంద మార్కులు సాధించిన వేర్వేరు జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకుల వ్యక్తిగత వివరాలను సిట్ అధికారులు సేకరించారు. వారిని కూడా హిమాయత్ నగర్లోని సిట్ కార్యాలయంలో రెండో రోజు విచారణ జరపుతున్నారు. ఈ కేసులో వీరే కాక మరికొంతమందిని కూడా సిట్ అధికారులు విచారణ జరుపునున్నట్లు తెలుస్తోంది.