2BHK Houses in Telangana: సొంత గూడు లేని పేదలకు వసతి కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకానికి అవాంతరాలు తొలగిపోవడం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవంటూ కొన్నిచోట్ల గుత్తేదారులు స్పందించలేదు. ముందుకు వచ్చినచోట బిల్లుల సమస్యతో పనులు ఆలస్యమయ్యాయి. ఇక ఇళ్లు పూర్తయినచోట లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రావడం లేదు.
ఏళ్లు గడుస్తున్నా...
ఏళ్లు గడుస్తున్నా అర్హులకు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో దరఖాస్తుదారుల్లో అసహనం పెరిగిపోతోంది. కొంతమంది ఇళ్ల తాళాలు పగులగొట్టి మరీ చొరబడుతున్నారు. మొన్న కురవిలో.. తాజాగా మంథనిలో రెండు పడకగదుల ఇళ్లలో ప్రవేశించారు. వారిని ఖాళీ చేయించడానికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నానా తిప్పలు పడాల్సివస్తోంది. మంజూరైన ఇళ్లతో పోలిస్తే దరఖాస్తుదారులు పెద్దసంఖ్యలో ఉండటం.. కొన్నిచోట్ల అనర్హులను ఎంపిక చేశారని ఆరోపణలు రావడంతో పథకం అమలులో ఆటంకాలు కలుగుతున్నాయి.
లబ్ధిదారులకు ఇచ్చినవి 6 శాతమే!
రాష్ట్రానికి 2.91 లక్షల రెండు పడకగదుల ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణం పూర్తయినవి, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలినవి కలిపి 1.82 లక్షల వరకు ఉంటాయని హౌసింగ్ కార్పొరేషన్ వర్గాల సమాచారం. వీటిలో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించినవి 17 వేలు మాత్రమే. అంటే మంజూరైన ఇళ్లలో దాదాపు 6 శాతమే. 60వేలకు పైగా ఇళ్ల పనులు మొదలే కాలేదు. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. కొన్ని నెలల క్రితమే ఇళ్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. పూర్తయిన ఇళ్లతో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య భారీగా ఉండటం.. ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోవడం.. కొన్నిచోట్ల అవినీతి ఆరోపణలు రావడం ఆలస్యానికి కారణమవుతున్నాయి.
రెండంతస్తుల్లో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ ఇళ్లు మహబూబాబాద్ పట్టణంలోనివి. వార్డు కౌన్సిలర్లు చెప్పినట్లే లబ్ధిదారులను ఎంపిక చేసినా.. వారికి తాళాలివ్వలేదు. ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గాంధీనగర్లో చేపట్టిన 36 ఇళ్ల నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయి నాలుగేళ్లవుతోంది.
రాష్ట్రంలో కొన్నిచోట్ల ఇదీ పరిస్థితి
*నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న దాదాపు 1200 ఇళ్లలో 500 చివరిదశలో ఉన్నాయి. 400 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి దాదాపు మూడేళ్లవుతోంది. 33 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పలుమార్లు సర్వేలు చేసి.. 5 వేలకు కుదించారు. యినా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కిరాలేదు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్లో నిర్మాణం పూర్తయి నాలుగేళ్లవుతున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి.
*సంగారెడ్డి జిల్లాలో 2,355 ఇళ్లు పూర్తి కాగా.. లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతోంది. అందోల్ మండలం డాకూరులో 104 ఇళ్లు నిర్మించారు. 500 దరఖాస్తులు రాగా, డ్రా తీసి 120 మందిని ఎంపికచేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో మరోసారి ఎంపిక చేసినా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయట్లేదు. తెల్లాపూర్ పురపాలక సంఘం పరిధిలోని కొల్లూరులో 15,500 ఇళ్లను నిర్మించి ఏడాది దాటినా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు.
*భూపాలపల్లిలో 544 ఇళ్ల నిర్మాణం 2019లోనే పూర్తయినా లబ్ధిదారుల్ని ఎంపిక చేయలేదు. 60 ఇళ్ల తలుపులు, కిటికీలు చోరీకి గురయ్యాయి. రెండంతస్తుల్లో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ ఇళ్లు మహబూబాబాద్ పట్టణంలోనివి. వార్డు కౌన్సిలర్లు చెప్పినట్లే లబ్ధిదారులను ఎంపిక చేసినా.. వారికి తాళాలివ్వలేదు. ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గాంధీనగర్లో చేపట్టిన 36 ఇళ్ల నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయి నాలుగేళ్లవుతోంది.