తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 4:42 AM IST

ETV Bharat / state

కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో కొత్తగా 1,278 కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,278 కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 32,224కు చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అధికంగా 762 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 10,354 కరోనా పరీక్షలు నిర్వహించారు.

1278 New corona cases were recorded in telangana
కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కొవిడ్‌ విస్తరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. జీహెచ్​ఎంసీ పరిధిలో మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగా... జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి రావటం లేదు. శుక్రవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో.. కొత్తగా 1,278 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 32,224కు పెరిగింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అధికంగా 762 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 171, మేడ్చల్‌ 85, సంగారెడ్డి 26, నల్గొండ 32... కామారెడ్డి 23, మెదక్‌ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17... మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేటల్లో 14 కేసులను గుర్తించారు. తాజా ఫలితాల్లో రాష్ట్రంలో 27 జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు నిర్ధరించారు.

కోలుకున్న 60 శాతం మంది..

ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 12,680 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 1,013 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి బయట పడిన వారి సంఖ్య 19,205కు చేరుకుంది. మొత్తం నమోదైన కేసుల్లో 60 శాతం మంది ఆరోగ్య వంతులుగా మారారు. మహమ్మారికి శుక్రవారం మరో 8 మంది మృత్యువాత పడగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 339కి పెరిగింది. మొత్తం బాధితుల్లో ఒక శాతం మరణాలు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

17,081 పడకలు సిద్ధం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 17,081 పడకలను బాధితుల కోసం సిద్ధం చేయగా.. ఇందులో శుక్రవారం నాటికి 1,618 మాత్రమే నిండాయని వైద్యారోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ కేంద్రంగా సేవలందిస్తోన్న గాంధీ ఆసుపత్రిలో 803 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. 1,087 పడకలు ఖాళీగా ఉన్నాయి.

10,354 కరోనా పరీక్షలు..

గడిచిన 24 గంటల్లో 10,354 కరోనా పరీక్షలను నిర్వహించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో యాంటీజెన్‌ పరీక్షలను.. జీహెచ్‌ఎంసీలో 300 వైద్యశాలలతో పాటు అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో నిర్వహిస్తుండటంతో.. పరీక్షల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యధికం. ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య లక్ష 51 వేల 109కి పెరిగింది. ఇందులో లక్ష 18 వేల 885 మందిలో వైరస్‌ లేదని తేలింది.

ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా స్వల్ప లక్షణాలతో వ్యాధి నిర్ధరణ అయినవారు 83 శాతం మంది ఉండగా.. తీవ్ర లక్షణాలు ఉన్నవారు 4 శాతం మంది.. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 13శాతం మంది ఉన్నారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చూడండి:దేశంలో కరోనా మరణాల​ రేటు తగ్గుతోంది: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details