తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగర శివార్లలో వంద కోట్ల మాదక ద్రవ్యాలు పట్టివేత - Hyderabad drug seizure

భాగ్యనగరంలో మరోసారి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌, ముంబయిలో వంద కోట్లకుపైగా విలువైన మాదక ద్రవ్యాలను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారితో పాటు.... మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మత్తు మందులను ఎక్కడెక్కడ ఎవరెవరికి సరఫరా చేశారన్న విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు.

Hyderabad Mumbai narcotics seized
భాగ్యనగర శివార్లలో వంద కోట్ల మాదక ద్రవ్యాలు పట్టివేత

By

Published : Aug 18, 2020, 6:13 AM IST

Updated : Aug 18, 2020, 6:28 AM IST

అక్రమార్జనే లక్ష్యంగా....మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను డీఆర్​ఐ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఓ ప్రైవేటు బస్సులో మత్తు మందులు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ముఠా గుట్టు రట్టు చేశారు. హైదరాబాదు, ముంబయిలో మూడు రోజులపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించి భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

రూ.97 కోట్ల సరుకు పట్టివేత

నగర శివారు ప్రాంతంలోని జిన్నారం మండలంలో మూసివేసిన ఓ ఫార్మా పరిశ్రమలో మత్తు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. విదేశాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న మెఫెడ్రొన్‌, కెటామైన్‌లతోపాటు మరికొన్ని నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. 47 కోట్ల విలువైన 210 కిలోలు మెఫెడ్రోన్‌, 10కిలోలు కెటామైన్‌, 31కిలోలు ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. 50 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ మాదకద్రవ్యాలు తయారు చేసేందుకు సిద్దంగా ఉన్న ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

పాత నిందితుడే కీలక సూత్రధారి

2017లో మాదకద్రవ్యాల కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన కీలక సూత్రధారిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మరో ఇద్దరిని ముంబైలో అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు హవాలా ద్వారా జరుగుతున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా... మత్తు మందులు ఎక్కడెక్కడ సరఫరా చేశారు, ఏ ఏ దేశాలకు ఎగుమతి చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరో రెండు మూడు రోజులు తమ సోదాలను కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

దర్యాప్తు వేగవంతం

ఈ ముఠా గుట్టు రట్టు చేసేందుకు డీఆర్​ఐ అధికారులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీని వెనుక గల నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నగరంలో సహాయక చర్యలు చేపడుతున్న డీఆర్​ఎఫ్​ బృందాలు

Last Updated : Aug 18, 2020, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details