రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికీ ఉండాల్సిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) పెంచింది. ఈ పెరిగిన ప్రీమియం ధరలు జూన్ 16 నుంచి వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఐఆర్డీఏఐ ఈ రేట్లను సవరిస్తుంటుంది.
పెరిగిన వాహనాల బీమా ప్రీమియం పెరిగిన కార్ల బీమా ప్రీమియం...
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం... 1000సీసీ కన్నా తక్కువ ఉన్న కార్లకు రూ.2,072 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 1,000-1,500సీసీ మధ్య ఉన్న కార్లకు రూ. 3,221 ఉండగా, 1500 సీసీకి మించి ఉన్న కార్లకు రూ.7,890 ప్రీమియం వర్తిస్తుంది.
కొత్త కార్ల విషయంలో మూడేళ్ల తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. 1,000 సీసీలోపు కార్లకు రూ. 5,286 ప్రీమియం ఉండగా, 1000- 1500 సీసీ కార్లకు రూ. 9, 534, ఆపైన సీసీ ఉన్న కార్లకు రూ. 24,305 ప్రీమియం చెల్లించాలి.
కొత్త ద్విచక్రవాహనాలకు ఐదేళ్ల బీమా తప్పనిసరి..
ద్విచక్రవాహనాల విషయానికొస్తే.. కొత్త ద్విచక్రవాహనాల ప్రీమియం రేట్లు గత ఏడాదికీ ఇప్పటికీ మారలేదు. కొత్త బైకులకు ఐదేళ్ల థర్డ్ పార్టీ ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 75సీసీ లోపు ద్విచక్ర వాహనాలకు 1,045 రూపాయలు.. 75- 150 సీసీ వాహనాలకు 3,285 రూపాయలు, 150-350 సీసీ ద్విచక్ర వాహనాలకు 5,433 రూపాయలు, ఆపైన సీసీ ఉన్న వాహనాలకు రూ.13,034 థర్డ్ పార్టీ ప్రీమియం చెల్లించాలి. పాత వాహనాలకు మాత్రం ప్రీమియం స్వల్పంగా పెరిగింది.