సార్వత్రిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఐదేళ్లు దేశ పాలన ఎవరి చేతుల్లో ఉంటుందో నిర్ణయించే సమయం మరికొన్ని గంటల్లో ప్రజల ముంగిట ఉండబోతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మరో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు కసరత్తు పూర్తి చేసింది. పోల్ గంట మోగటమే తరువాయి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే దేశంలోనే రాజకీయ పార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. వచ్చేది మా ప్రభుత్వమే అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి.
మరికొన్ని గంటల్లో ప్రకటన..
ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఈసీ...మరికొన్ని గంటల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే మే నెలలో 16 వ లోక్సభ పదవీ కాలం ముగుస్తుంది. ఈలోపే ఎన్నికల నిర్వహణ పూర్తితో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. పుల్వామ ఘటన తర్వాత భారత్ -పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశంలో నెలకొన్న సమస్యలతో కొంత ఆలస్యంగా జరుగుతాయని భావించినా..అనుకున్న కాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.
రాష్ట్రాల శాసనసభలకు....
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు ఎన్నికలతో పాటు...ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, కొంతకాలంగా గవర్నర్ పాలన కొనసాగుతున్న జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలూ జరగనున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ త్వరగా విడుదల చేస్తే సజావుగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.