తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా చంద్రగిరి రీ పోలింగ్.. 89 శాతం ఓటింగ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో.. రీ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది. 89.29 శాతం ఓటింగ్ నమోదైంది.

By

Published : May 20, 2019, 12:45 AM IST

ప్రశాంతంగా చంద్రగిరి రీ పోలింగ్.. 89 శాతం ఓటింగ్

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో రీ పోలింగ్.. ప్రశాంతంగా పూర్తయింది. పాకాల మండలంలోని పులివర్తివారి పల్లె, రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాళేపల్లి, ఎన్ ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగింది.

1 శాతం తగ్గిన ఓటింగ్

పాకాల మండలం పులివర్తి వారి పల్లెలో 95.03 శాతం... రామచంద్రాపురం మండలం కాలేపల్లిలో 94.64 శాతం, వెంకటరామాపురంలో 89.66 శాతం, కొత్తకండ్రిగలో 84.86 శాతం, కమ్మపల్లెలో 83.56 శాతం, ఎన్ ఆర్ కమ్మపల్లెలో 83.56 శాతం, కుప్పం బాదూరులో 92.04 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తంగా... ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో 89.29 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో నమోదైన 90.42 శాతంతో పోలిస్తే....1.13 శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది.

ఉదయం 6 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా..... ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ప్రచారం సమయంలో ఆయా గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో..... వేరే గ్రామాలకు సంబంధించిన ప్రజలను పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి, గుర్తింపు కార్డులను చూసిన తర్వాతే.. ఆయా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించారు.

నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన పార్టీలైన తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థులు శివప్రసాద్, రెడ్డప్ప ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. రీ పోలింగ్ ప్రక్రియ కోరిన వారికి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారని తెదేపా అభ్యర్థి పులివర్తినాని అన్నారు.

పులివర్తి వారి పల్లెలో తెదేపా అభ్యర్థి నాని, వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి బంధువులకు మధ్య చిన్న వాగ్వివాదం జరగ్గా... పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేశారు. ఈ ఘటనలో పులివర్తి నానిపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. కమ్మపల్లెలో ఎన్నికల అధికారులతో వాగ్విదానికి దిగిన ముని చంద్రనాయుడు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రెండు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతగా సాగినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి తెదేపా, వైకాపా నుంచి పలు ఫిర్యాదులు అందగా... విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహించింది.

ప్రశాంతంగా చంద్రగిరి రీ పోలింగ్.. 89 శాతం ఓటింగ్

ఇవీ చూడండి: ఇక్కడ కారు జోరు... అక్కడ సైకిల్ హవా

ABOUT THE AUTHOR

...view details