మణుగూరు సమీపంలో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రంలో రెండు ప్లాంట్ల ప్రారంభానికి రాష్ట్ర జెన్కో చకాచకా సన్నాహాలు చేస్తోంది. ఒక్కోటీ 270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 4 ప్లాంట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తోంది. వీటిలో ఒక ప్లాంటులో ప్రయోగాత్మక విద్యుదుత్పత్తిని 2019 మార్చి 25న ప్రారంభించారు. దాని వాణిజ్య ఉత్పత్తి తేదీ(సీవోడీ)ని 2, 3 రోజుల్లో ప్రకటించాలని తాజాగా నిర్ణయించారు.
ఇందులో భాగంగా సోమవారం నుంచి పూర్తిస్థాయిలో 270 మెగావాట్ల్లు ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త ప్లాంటుకు సీవోడీ ప్రకటించాలంటే పూర్తిస్థాయి సామర్థ్యంతో ఏకబిగిన అది 72 గంటలపాటు విద్యుదుత్పత్తి చేయాలి. ఈ నిబంధన పూర్తయిన తేదీనే సీవోడీగా ప్రకటిస్తూ కేంద్ర విద్యుత్శాఖకు తెలంగాణ జెన్కో తెలియజేస్తుంది. సీవోడీ ప్రకటించినప్పటి నుంచే అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును తీసుకుని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు జెన్కోకు సొమ్ము చెల్లించాలనే నిబంధన ఉంది.
ఈ క్రమంలో నెలాఖరులోగా దీని సీవోడీ ప్రకటించి మరో 15 రోజుల్లోగా రెండో ప్లాంటులో ప్రయోగాత్మక విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రం నిర్మాణ కాంట్రాక్టును భెల్కు అప్పగించారు. నిర్మాణ కార్యక్రమాలకు తొలుత 2015లో శంకుస్థాపన చేశారు. కానీ, దీని నిర్మాణాన్ని ఆపివేయాలని కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేయడంతో రెండేళ్ల జాప్యం జరిగింది. తిరిగి 2017 మార్చి 30న నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి 38 నెలల(ఈ నెల 30)లోగా తొలి ప్లాంటు సీవోడీ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణం ప్రారంభించాక కనీసం 48 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర విద్యుత్శాఖ మార్గదర్శకాలున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని వేగంగా పూర్తిచేయడానికి జెన్కో సకల యత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలుత కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా జెన్కో పూర్తిచేసింది. ఇప్పుడు భద్రాద్రిని కూడా ప్రారంభిస్తే రాష్ట్రానికి అదనంగా 1080 మెగావాట్ల కరెంటు లభిస్తుంది. భద్రాద్రి పనులు వేగంగా చేస్తున్నామని, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిబ్బంది శ్రమిస్తున్నారని జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు