గోదావరి పరీవాహక ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కోసం ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న మావోలు వారికి చిక్కడం లేదు. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు, మావోల కదలికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అటవీ ప్రాంతంలోని పల్లెల్లో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు.
మూడోరోజూ ముమ్మర కూంబింగ్
ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన మావోలు మళ్లీ తిరిగి వెళ్లే దారి లేదని పోలీసులు గట్టి నమ్మకంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మణుగూరు, కరకగూడెం, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మూడో రోజు అడవిని అణువణువూ గాలిస్తూ వారికోసం విశ్వప్రయత్నాలు చేశారు. అటవీ ప్రాంతంతో పాటు మండల కేంద్రాలు, ప్రధాన రహదారులపై ముమ్మరంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు.
మావోయిస్టుల పయనమెటు..?
అటవీ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్న వేళ మావోయిస్టులు ఎటు వెళ్లారన్న ప్రశ్నలు ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఎదురుకాల్పులు జరిగిన సమయంలో కిట్ బ్యాగులు, ఆయుధాలు, సామగ్రి పోలీసులకు లభించినా... వారి జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు చిక్కకుండా మావోలు ఎటు వెళ్లారన్న సందేహాలు శేష ప్రశ్నలుగానే మిగిలాయి. మూడ్రోజుల గాలింపు చర్యలకు కూడా వారి జాడ లేకపోవడం గమనార్హం.