మారుమూల గిరిజన గ్రామాల పిల్లలకు సైతం విద్యను అందించేందుకు వారి గ్రామాల్లోనే సకల సౌకర్యాలతో విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థనూ ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలోని అడవి బిడ్డల గ్రామమైన కొండ తోగు ఇందుకు ఉదాహరణ. ఈ గ్రామం బడి పిల్లల కష్టాలపై ఈటీవీలో వచ్చిన కథనం అధికారులను కదిలించింది. చిన్నారుల కష్టాలు తీర్చింది.
అశ్వారావుపేట మండలం కొండ తోగులో బడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి. అది కూడా దట్టమైన అడవిలో వాగులు, వంకలు దాటుకుంటూ... రాళ్లు, రప్పల్లో నడుచుకుంటూ వెళితే కాని అక్షరాలు నేర్చుకోలేం. మార్గమధ్యంలో అటవీ జంతువుల భయాలు.. పొంగిపొర్లే వాగుల మధ్య చిన్నారులు పడే వేదన అంతా ఇంతా కాదు. అయినా చదువు పట్ల ఆ పిల్లల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.
ఈ పరిస్థితి మార్చాలని.. తమ గూడెంలోనే బడి ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు... అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.