తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతలను ముంచేస్తున్న అకాల వర్షాలు - తెలంగాణ వార్తలు

అకాల వర్షాలు అన్నదాత ఆశలను ముంచేస్తున్నాయి. చేతికొచ్చి కల్లాల్లో ఎండుతున్న ధాన్యం, మిరప వంటి పంటలు కళ్లముందే వర్షపునీటిలో తడిచి పాడవుతున్నాయి. బత్తాయి, మామిడి వంటి పండ్లతోటలకే కాకుండా అక్కడక్కడ కూరగాయల తోటలను సైతం ఈదురుగాలులు, వర్షాలు దెబ్బతీస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలేర్పడి పలుచోట్ల గంట, 2 గంటల వ్యవధిలోనే నాలుగైదు సెంటీమీటర్ల వర్షం పడుతుండడంతో ఆరబెట్టిన ధాన్యం, మిరప నీటిలో కొట్టుకుపోతున్నాయి.

Chili crop submerged with premature rains
chilli crop

By

Published : Apr 16, 2021, 6:41 AM IST

గత 3 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి, గురువారం పగలు అత్యధికంగా కొత్తగూడెం(భద్రాద్రి జిల్లా)లో 8.9, భద్రాచలంలో 7, బూర్గంపాడులో 6, పాల్వంచ 6, తల్లాడ(ఖమ్మం) 3, మహబూబ్‌నగర్‌ 3.7, మాచాపూర్‌(కామారెడ్డి)లో 2.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో సైతం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.

* గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహకంలో ఆరబెట్టిన మిరపకాయలు నీటిలో కొట్టుకుపోయాయి. చర్ల మండలం వీరాపురం, జీపీపల్లి, చింతకుంట, మొగళ్లపల్లి, సి.కత్తిగూడెం తదితర గ్రామాల్లో వరద నీటిలో పంట తేలియాడుతుండటంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.

* మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మంచ్యా తండాలో 15 మంది గిరిజన పేద రైతులకు చెందిన మిరప పంట కోసి కల్లాల్లో ఆరబోయగా పూర్తిగా నీటమునిగి పాడైంది. అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలని పేద రైతులు వాపోతున్నారు. ఎకరాన్నర మిరప సాగుకు రూ.లక్షా 20 వేలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినట్లు రవి అనే రైతు ‘ఈనాడు’ ప్రతినిధి వద్ద వాపోయారు.

* కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మార్కెట్‌లో కొత్తపల్లికి చెందిన రైతు శనిగరపు దామోదర్‌, ఏనుగుల గంగయ్యలు ఆరబెట్టిన ధాన్యం 7-8 ట్రక్కుల మేర వర్షం నీటికి కొట్టుకుపోయి ఎస్సారెస్పీ కాలువ పాలైంది.

* నీటమునిగిన పంటల వివరాలు సేకరించి పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామ్‌రెడ్డి ‘ఈనాడకు చెప్పారు.

రూ.లక్షన్నర మిరపకాయలు నాశనమయ్యాయి

రూ.లక్షన్నర అప్పులు తెచ్చి ఎకరాన్నర మిరప పంట సాగు చేశా. మిరపకాయలు కోయడానికి కూలీలు దొరక్క చాలా అవస్థలు పడ్డా. రోజుకు మనిషికి రూ.300 చొప్పున కూలీ చెల్లించి మిరపకాయలు కోయించి ఎండకు ఆరబోస్తే ఒక్కరాత్రిలో కురిసిన వర్షాలకు తడిసి పాడయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. - భూక్యా వీరన్న, మంచ్యా తండా, కురవి, మండలం, మహబాబాబాద్‌ జిల్లా.

ఇదీ చూడండి:'ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం మనదే'

ABOUT THE AUTHOR

...view details