భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మిషన్ కాకతీయ నీటిపారుదల విభాగానికి చెందిన ఏఈ నవీన్ కుమార్ మిషన్ కాకతీయ గుత్తేదారు నుండి లక్షా ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ. 20 లక్షలకు సంబంధించిన బిల్లుల కోసం గుత్తేదారు నుండి ఏఈ నవీన్ కుమార్ లక్షా ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గుత్తేదారు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ దాడుల్లో లంచం తీసుకున్నట్టు నిరూపణ అయినట్టు వరంగల్ నుంచి వచ్చి దాడుల్లో పాల్గొన్న డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఏడాదిలో ముగ్గురు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారులు! - మిషన్ కాకతీయలో అవినీతి అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్కాకతీయ నీటి పారుదల విభాగంలో పనిచేసే ఏఈ నవీన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఈ ఏడాదిలోనే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు ముగ్గురు ఏసీబీకి చిక్కడం జిల్లాలో చర్చనీయాంశమయింది.
గతంలోనూ.. పురపాలక శాఖలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ దొరికారు. మొదటి కేసు ఏడాది క్రితం పురపాలక శాఖలో పనిచేసే అనిల్ అనే ఏఈ రూ.70 వేలు లంచం తీసుకొని ఏసీబీకి చిక్కాడు. ఇది గడిచి ఏడు నెలల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టెక్నికల్ ఉద్యోగి మరియు ఇంచార్జ్ ఏఈ గా పనిచేస్తున్న బాబు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఇల్లందు పట్టణంలో గడిచిన ఏడాది కాలంలో ఇద్దరు పురపాలక ఏఈలు, ఒక నీటి పారుదల శాఖ ఏఈ లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం వల్లమిషన్ కాకతీయ చెరువుల అభివృద్ధి పనులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పనుల నాణ్యతను పరిశీలించి బిల్లు చెల్లింపు చేయాల్సిన అధికారులే బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తూ దొరికిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్