తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2021, 4:27 PM IST

ETV Bharat / state

ADILABAD TRS: జిల్లా అధ్యక్షుల ఎంపికలో అనిశ్చితి..

ఆదిలాబాద్ జిల్లా తెరాస అధ్యక్షుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. నేడు జరగనున్న తెరాస శాసనసభాపక్ష భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుల కోసం ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీ అధిష్ఠానం నియమాక ప్రక్రియను ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్, భాజపాలకు ధీటుగా నిలబడి పనిచేసే అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ఖరారు చేయాల్సి ఉండగా.. అకాల వర్షాలు, శాసనసభ సమావేశాల కారణంగా వాయిదా పడింది. హైదరాబాద్‌లో ఇవాళ జరగనున్న శాసనసభాపక్ష భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆశావహులను అంతర్మథనానికి గురిచేస్తోంది.

TRS  meeting in hyderabad on all district president selection discussion today
ఆదిలాబాద్ జిల్లా తెరాస అధ్యక్షుల ఎంపికపై అనిశ్చితి

ఆదిలాబాద్ జిల్లా తెరాస అధ్యక్షుల ఎంపిక విషయంలో అనిశ్చితి కనిపిస్తోంది. దీటైన అభ్యర్థుల కోసం ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీ అధిష్ఠానం నియామక ప్రక్రియపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై చర్చించేందుకు ఇవాళ హైదరాబాద్‌లో తెరాస శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. కాంగ్రెస్, భాజపాలకు ధీటుగా నిలబడి పనిచేయడంతో పాటు పార్టీకి అన్నివిధాలుగా మేలు చేసేలా సరైన అభ్యర్థుల కోసం ఆరా తీస్తోంది. ముందుగా అనుకున్న దాని ప్రకారమైతే ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ఖరారు చేయాల్సి ఉంది. కానీ మధ్యలో వచ్చిన అకాల వర్షాలు, శాసనసభ సమావేశాల కారణంగా వాయిదాపడింది. ఇవాళ జరగనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆశావహుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

షెడ్యూల్‌లో మార్పు

జిల్లాల పునర్విభజన కంటే ముందు తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా తెరాస జిల్లా కమిటీలు పనిచేసేవి. పశ్చిమ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్‌ అధ్యక్షుడిగా లోక భూమారెడ్డి, తూర్పు ప్రాంతం అధ్యక్షులుగా పురాణం సతీశ్‌ ఉండేవారు. పునర్విభజన తరువాత లోక భూమారెడ్డి రాష్ట్ర డెయిరీ ఛైర్మన్‌గా, పురాణం సతీశ్ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ అయినా కూడా ఇంకా అనధికార అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇటీవల అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించాలని తెరాస నిర్ణయించింది. షెడ్యూల్‌ ప్రకారమైతే గత నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్న గులాబీదళం సెప్టెంబర్‌ 25 నుంచి 30 తేదీలోగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ గత నెల 17న ప్రారంభమైన శాసనసభ, వర్షాకాల సమావేశాలు ఈనెల అయిదో తేదీతో ముగియాల్సి ఉంది. కానీ అక్టోబర్‌ 1న వర్షాలు, 2న గాంధీజయంతి, 3న బతుకమ్మ సెలవులు రావడంతో శాసనసభ సమావేశాలను ఈనెల 8వరకు పొడిగించాల్సి వచ్చింది. దీనికి తోడు హుజూరాబాద్‌ ఎన్నికల పర్వం తెరపైకి రావడంతో జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది.

ప్రాధాన్యతలేంటీ.?

ఆదిలాబాద్, కుమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు, ప్రధానంగా ఆదివాసీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ రెండింటిలో ఒక జిల్లాకు ఆదివాసీ అధ్యక్షున్ని ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. కానీ కుమురం భీం అసిఫాబాద్, నిర్మల్‌ జిల్లాల మధ్య రాజకీయాలను పరిగణలోకి తీసుకొని సమన్వయం చేసుకునేలా పార్టీ పావులు కదుపుతోంది. నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడిగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులను అధ్యక్షుడిగా నియమించడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఎంపీతోపాటు చెన్నూరు, బెల్లంపల్లి శాసనసభ్యులు ఇప్పటికే ఎస్సీలకు రిజర్వ్‌ కావడంతో పదవుల్లో అవకాశం లభించని ఇతర కులాలకు అవకాశం ఇవ్వాలని వ్యూహరచన చేస్తోంది. ఆదిలాబాద్, కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఒక జిల్లాకు ఆదివాసినీ, మరో జిల్లాకు బీసీ లేదా ఓసీ అభ్యర్థులను నియమిస్తే సమన్యాయం చేసినట్లవుతుందని అధిష్ఠానం భావిస్తోంది.

దీనిపై అంతర్గతంగా పార్టీ సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యతాంశంగా మారింది. ఇందులోనూ దేనికీ లోటురాకుండా అన్ని విధాలుగా పార్టీని ముందుకు నడిపే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆరాతీస్తోంది. ఫలానా అభ్యర్థే జిల్లా అధ్యక్షుడు అని ప్రకటించలేనంతగా పదవులను ఆశిస్తున్న ఆశావహుల వివరాలను ఇప్పటికే నిఘావర్గాలతో రహస్యంగా సర్వే చేయించింది. ఫలితంగా ఎమ్మెల్యేలు కూడా జట్టు కట్టి ఎవరో ఒకరికి మాటివ్వకుండా కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నేడు కీలక సమావేశం

తెరాస శాసనసభా పక్ష సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంట్లో పార్టీ విధివిధానాలతో పాటు జిల్లా అధ్యక్షుల ఎంపికపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 25న రాష్ట్ర స్థాయి ప్లీనరి సమావేశంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందుగా జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రస్తావన తీసుకురావడం లేదు. రాష్ట్ర కమిటీ ఖరారైన తరువాతనే జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తారా..? లేక ఆదివారం ప్రకటిస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. దాదాపుగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తరువాతనే జిల్లా అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జిల్లా అధ్యక్షులను అధిష్ఠానమే ప్రకటించి జిల్లా కార్యవర్గాలను మాత్రం ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలకు అప్పగించాలని తెరాస ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆదివారం నాటి శాసనసభాపక్ష భేటీ అన్ని విధాలుగా కీలకంగా మారింది.

ఇదీ చూడండి:Cm Kcr: సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ

ABOUT THE AUTHOR

...view details