తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలింతలకు లంచాల చింత.. రిమ్స్​ ప్రసవ విభాగంలో ఆగని అవినీతి - adilabad news

ఆదిలాబాద్​ జిల్లాలోని పేద ప్రజలందరికి రిమ్స్‌ ఆసుపత్రే పెద్ద దిక్కు. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిమితంగా సేవలందుతున్నాయి. దీంతో అంతా రిమ్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రసవం కోసం వచ్చే వారి నుంచి కాన్పు మొదలుకొని డిశ్ఛార్జీ వరకు అడుగడుగునా సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటులో డబ్బులు కట్టే స్థోమత లేకనే ఇక్కడకొచ్చామని ఇక్కడా డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.

rims hospital staff taking bribe for every thing
rims hospital staff taking bribe for every thing

By

Published : Aug 26, 2020, 8:10 AM IST

కొవిడ్‌ భయంతో ఆదిలాబాద్​ జిల్లాలో చాలా చోట్ల ప్రైవేటు ఆసుపత్రులు సేవలందించడం లేదు. ప్రధానంగా ప్రసవాలు చేయటానికి సైతం ప్రైవేటులో వైద్యులు ఆసక్తి చూపటం లేదు. కొన్ని నర్సింగ్‌ హోంలలో కాన్పులు చేస్తున్నా... భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ కాన్పు చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు, శస్త్ర చికిత్స కాన్పులకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బిల్లు వేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది కాన్పుల కోసం రిమ్స్‌ ఆసుపత్రినే ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 20 నుంచి 30 వరకు ఇక్కడ కాన్పులవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని రిమ్స్‌ ప్రసవ విభాగంలో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు.

ప్రసవ విభాగంలో విధుల కోసం పైరవీలు

ప్రసవ విభాగంలో విధులు నిర్వహించటానికి కొందరు సిబ్బంది రాజకీయ ప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇలాగే అక్రమాలకు పాల్పడిన వారిని ఆ వార్డు నుంచి తొలగిస్తే వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించి రిమ్స్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్లీ అదే వార్డులో విధులు కేటాయించుకునేలా చేశారని తన పేరు వెల్లడించని ఒక వైద్యుడు పేర్కొన్నారు. మరికొందరు యూనియన్‌లను ఆశ్రయించి ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.

రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

బండారు నరేందర్‌, ఆర్‌ఎంఓ

రిమ్స్‌లో చికిత్సలు చేయించుకోవటానికి వచ్చిన వారు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే పర్యవేక్షకునికి లేదా ఆర్‌ఎంఓకు నేరుగా ఫిర్యాదు చేయాలి. డబ్బులు అడిగిన సిబ్బందిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వ్యవహారం పునరావృతం కాకుండా చూస్తాం.

చేతిలో రూ. 50 ఉంటేనే డ్రెస్సింగ్‌..

చేతిలో రూ.50 నోటుతో కూర్చున్న ఈ బాలింత చిచ్‌ధరి ఖానాపూర్‌కు చెందిన సునీత. శస్త్ర చికిత్స ప్రసవం అయి ఆరు రోజులైంది. శస్త్ర చికిత్స చేసిన చోట డ్రెస్సింగ్‌ మార్చుకోవాలంటే ఇలా చేతిలో నోటుతో గదిలోకి వెళితేనే సిబ్బంది డ్రెస్సింగ్‌ (పట్టీ మార్చటం) చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే మానవత్వం మరిచి నొప్పి పెట్టేలా ఇష్టానుసారం వ్యవహరించటం మామూలుగా మారింది.

ప్రతి పనికి ధర నిర్ణయించి వసూలు చేస్తున్న సిబ్బంది

ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలింత తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన మనీష. ప్రసవం కోసం ఈ నెల 16న రిమ్స్‌లో చేరింది. 17న శస్త్ర చికిత్స జరిగింది. జన్మించిన శిశువును ఇవ్వటానికి సిబ్బంది రూ.500 డిమాండ్‌ చేసి తీసుకున్నారని, బిడ్డ పుట్టిన అనంతరం శుభ్రం చేయటానికి రూ.ఒక వంద, శస్త్ర చికిత్స అయిన చోట డ్రెస్సింగ్‌ చేయటానికి రూ.100 నిర్బంధంగా వసూలు చేశారని ఆమె వాపోయారు.

ప్రతి పనికి ధరలు

*ప్రసవ విభాగంలో ప్రతి పనికి నిర్ణీత ధరలను నిర్ణయించి వసూలు చేయటం సర్వసాధారణంగా మారింది. మగబిడ్డ పుడితే ఒక ధర, ఆడ బిడ్డ పుడితే మరో ధర అంటూ వసూలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

● మగబిడ్డ జన్మిస్తే రూ.500, ఆడపిల్లయితే రూ.300

● జన్మించిన బిడ్డను శుభ్రం చేసి, నూనె రాస్తే రూ.200 నుంచి రూ.300

● శస్త్ర చికిత్స చేసిన చోట పట్టీ మార్చితే(డ్రెస్సింగ్‌ చేస్తే) రూ.50 నుంచి రూ.100

● బాలింతకు అమర్చిన మూత్ర సంచి మార్చితే రూ.50 నుంచి రూ.100

● బాలింతను పడక మార్చితే రూ.100

ఇదీ చూడండి:'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ABOUT THE AUTHOR

...view details