తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 12:26 PM IST

ETV Bharat / state

కరోనా కరాళ నృత్యం.. పర్యవేక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో ఉన్న కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది.

corona cases in adilabad
ఆదిలాబాద్​లో కరోనా కేసుల బీభత్సం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా ఐసోలేషన్లపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు ఏర్పాటుచేసి అత్యవసర వైద్యసేవలను మెరుగుపర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. ఆదిలాబాద్‌ రిమ్స్‌, నిర్మల్‌, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ కేంద్రాల్లో ఐసోలేషన్‌ కేంద్రాల పరిధిలో దాదాపుగా 250 మంది కరోనా రోగులకు మెరుగైన స్థాయిలో చికిత్సలు అందడంలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించగల సమర్థ నాయకత్వం కొరవడింది.

కరవైన సమష్టి కృషి

మొదటి దశ కరోనా సమయంలో కలిసి పనిచేసిన సమష్టి కృషి ఇప్పుడు కనిపించడంలేదు. ఫలితంగా ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతోంది. రెండో దశ కరోనా ప్రారంభమైన తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 350 మందికి పైనే మృత్యువాతపడితే అధికారికంగా ఈ సంఖ్య 200 దాటడం లేదు. ఇప్పటికీ వేల సంఖ్యలో క్రియాశీలక కేసులు నమోదవుతూనే ఉన్నప్పటికీ అధికారులు వెల్లడించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.

విమర్శల వెల్లువ

మే 12 నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభమైన తరువాత టీకాల కార్యక్రమం ఆశించినట్లుగా ముందుకు సాగడంలేదు. మొదటి డోసు టీకాలైతే ఎవరికీ ఇవ్వడమే లేదు. రోజుకో విధంగా నిబంధనలను అమలుచేస్తుండటంతో ఏ కార్యక్రమం సజావుగా సాగడంలేదు. ఆదిలాబాద్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలనే సీఎం ఆదేశాలు ఆమలుకాలేదు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తాత్కాలిక పద్ధతిన అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.

కుదరని సఖ్యత

ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌, పెద్దపల్లి ఎంపీలు సహా పది మంది శాసనసభ్యుల మధ్య సఖ్యత కుదరడం లేదు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాస్థాయిలో నేతలంతా కలిసి ఒక్కటంటే ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం అధికారులకు కలిసి వస్తోంది. ప్రతి పనికి లాక్‌డౌనే సమాధానమన్నట్లు తయారవుతోంది.

చొరవ తీసుకోవాలి

కరోనా బాధితులు, పాజిటివ్ కేసుల వివరాలను ప్రాంతాలకు అనుగుణంగా ఏరోజుకారోజు వెల్లడిస్తే.. ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అసలు వివరాలే వెల్లడించకపోవడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియడం లేదు. పక్కనే కరోనా రోగులు ఉన్నప్పటికీ గుర్తించడం కష్టంగా మారింది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని ఆసుపత్రులను సందర్శిస్తే తప్ప బాధితులకు సాంత్వన చేకూరే అవకాశం కనిపించడం లేదు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్‌’!

ABOUT THE AUTHOR

...view details