తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టుల కదలికలపై నిఘా.. అడవుల్లో పోలీసుల కూంబింగ్​ - maoist latest updates

ఉత్తర తెలంగాణలో ఒకప్పటి పీపుల్స్‌వార్‌ ప్రయోగశాలగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మళ్లీ ఉద్యమం రూపుదాల్చుకుంటుందా..? అంటే పోలీసుల ప్రతిచర్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్​ రాష్ట్రాల నుంచి మావోయిస్టు దళాలు జిల్లాలోకి ప్రవేశించే వీలుందనే నిఘావర్గాల సమాచారం మేరకు పోలీసుశాఖ మళ్లీ పొజిషన్‌ తీసుకుంది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత, పెన్‌గంగ పరివాహక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసింది.

police started cumbing in adilabad forests for mavoist
police started cumbing in adilabad forests for mavoist

By

Published : May 23, 2021, 7:08 PM IST

ఆసుపత్రుల వద్ద ప్రత్యేక నిఘా

ఛత్తీస్‌గఢ్​, మహారాష్ట్ర అడవుల్లోని కొంతమంది మావోయిస్టులు కరోనా బారినపడినట్లు పోలీసులకు సమాచారం ఉంది. మరికొంతమంది సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉండటంతో ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు పోలీసుశాఖ భావిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వ్యూహాత్మకంగా వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసుశాఖ.. ఆసుపత్రుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసింది. ఆదిలాబాద్​ జిల్లాలో మావోయిస్టులకు అనుకూలమైన ఆసిఫాబాద్‌, చెన్నూరు, బోథ్‌, నిర్మల్‌, ఉట్నూర్‌లాంటి ప్రాంతాల్లోని ఆసుపత్రులనే కాకుండా మెడికల్‌ దుకాణాల వద్ద కూడా కొత్త వ్యక్తుల కదలికలను ఆరాతీసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఆసిఫాబాద్‌ ఇంఛార్జీ ఎస్పీగా ఉన్న రామగుండం సీపీ సత్యనారాయణ సహా మంచిర్యాల పోలీసు అధికారుల ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

కూంబింగ్​ ముమ్మరం

ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఆసిఫాబాద్‌, బెజ్జూరు, కెరమెరి, కౌటాల, వాంకిడి, ఉట్నూర్‌, సారంగపూర్‌, కడెం, బోథ్‌, బజార్‌హత్నూర్‌ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్​ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందటనే ఒక్కో ప్రాంతానికి రెండేసి పోలీసు ప్లాటూన్లను రంగంలోకి దించడం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వెల్లడిస్తోంది. కొంతమంది ఎస్‌ఐబీ అధికారులు సైతం సాధారణ వ్యక్తుల్లాగా సంచరిస్తూ వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టులు సైతం మాస్కులు దరిస్తూ... జనాల్లో సంచరిస్తున్నారనే సమాచారమే పోలీసుశాఖను అప్రమత్తం చేస్తోంది.

మళ్లీ అలజడి

కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అటవీప్రాంతంలో గతేడాది సెప్టెంబర్‌ 19న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్​కు చెందిన చుక్కాలు, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాజీరావు మరణించిన విషయం విధితమే. ఆ తరువాత నక్సల్స్‌ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో ఏడాదికాలంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణలో కరోనా విజృంభణ మావోయిస్టులకు సోకినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇందులో భాగంగానే వైద్యం కోసం మావోయిస్టులు ఆసుపత్రులకు వస్తున్నట్లు పసిగట్టి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పాత 19 సర్కిళ్లతోపాటు 71 పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసిన పోలీసు అధికారులు... ఎప్పటికప్పుడు నక్సల్స్‌ కదలికలను అంచనా వేసే ప్రయత్నం చేస్తుండటంతో జిల్లాలో మళ్లీ అలజడి కనిపిస్తోంది.

నాలుగు జిల్లాల సమన్వయం

పాత ఆదిలాబాద్‌ జిల్లాలోని పోలీసుఅధికారులు... ఛత్తీస్‌గఢ్​, మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగే ఆలోచన కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్​లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్‌ మృతిచెందడంతో కవ్వింపు చర్యలు ఉండవచ్చనే కోణంలో పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసింది. ఆదిలాబాద్‌ ఎస్పీ రాజేశ్‌ చంద్ర, కుమురంభీం ఇంఛార్జీగా కొనసాగుతున్న రామగుండం సీపీ సత్యనారాయణ సహా నాలుగు మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల అధికారులంతా ప్రణాళికాబద్ధంగా నక్సల్స్‌తోపాటు సానుభూతిపరుల వివరాలు సేకరిస్తుండం, కదలికలను ఆరాతీస్తుండటంతో ప్రాధాన్యతాంశంగా మారింది.

ఇదీ చూడండి: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details