తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 5:49 PM IST

ETV Bharat / state

ప్రైవేటు సేవలో టీ-హబ్‌.. అక్రమంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు.!

నిరుపేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయాల్సిన ఆదిలాబాద్‌ టీహబ్‌ కేంద్రం ప్రైవేటు వ్యక్తుల సేవలో తరిస్తోంది. ఇటీవల రిమ్స్‌ ఆసుపత్రిలో బినామీ వ్యక్తులు విధులు నిర్వహిస్తూ, తమ ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి సేకరించిన నమూనాలకు నిర్ధరణ పరీక్షలు చేసిన వైనం కలకలం సృష్టించింది. తాజాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలోనూ ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగడంతో సేవలు గాడితప్పాయి.

outsiders are utilizing t hubs
ఆదిలాబాద్​ టీ-హబ్‌

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో మూడు నెలల కిందట టీ హబ్‌ పేరిట వ్యాధి నిర్ధరణ పరీక్షల కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 57 రకాల రక్త, మూత్ర నమూనాలకు పరీక్షలు చేసేలా అధునాతన యంత్రాలను నెలకొల్పారు. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని పేదలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వేలల్లో పరీక్షలు చేసుకోలేని వారి కోసం ఉచితంగా పరీక్షలు చేయడమే ఈ కేంద్రం ముఖ్యోద్దేశం. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని ఐదు పట్టణ పీహెచ్​సీల నుంచి వచ్చిన నమూనాలకు మాత్రమే ఇక్కడ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యశాఖలో పనిచేసే కొంతమంది ఉన్నతాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ప్రైవేటు నర్సింగ్‌హోంలలో పనిచేసే సిబ్బంది టీ హబ్‌ సేవలను నీరుగార్చేయత్నం చేస్తున్నారు.

గాడి తప్పిన ఉచిత సేవలు

ఇక్కడ పరీక్షలు చేయాలంటే ఏదో ఒక పీహెచ్‌సీ నుంచి గానీ, అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ నుంచి నమూనాలు రావాలి. అక్కడ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాల ఫలితాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి టీ-హబ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక వాహనంలో వారిచ్చిన డబ్బాల్లోనే పెట్టి చేరవేయాలి. మారుమూల పీహెచ్‌సీల్లో అంతర్జాల సౌకర్యం లేదనే వెసులుబాటును సాకుగా తీసుకుని టీ-హబ్‌ నిర్వాహకులే నేరుగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆయా పీహెచ్‌సీల నుంచి నమూనాలు సేకరించినట్లుగా నివేదికలు రూపొందించి పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కుటుంబీకులకు సంబంధించిన రక్త నమూనాలను టీ-హబ్‌ కేంద్రానికి నేరుగా పంపించి పరీక్షలు చేయించడం ఆరోపణలకు బలాన్నిచ్చింది.

పీహెచ్​సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన నమూనాలను మాత్రమే టీ హబ్​ సిబ్బంది తీసుకోవాలి. వాటికే పరీక్షలు నిర్వహించాలి. కానీ ప్రైవేటు ల్యాబ్​ల నిర్వాహకులతో టీ హబ్​ సిబ్బంది కుమ్మక్కై రోగుల నుంచి పరీక్షల కోసం సేకరించిన సొమ్మును దండుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. -రూపేష్​, సామాజిక కార్యకర్త

ఒత్తిడి మేరకే

టీ-హబ్‌లో నిర్వహించే పరీక్షల్లో కచ్చితత్వం ఉండటంతో పాటు... జిల్లాలో చేయలేని పరీక్షలు ఇక్కడ చేస్తుండటంతో ప్రైవేటు దందాకు తెరతీసింది. టీ-హబ్‌లో ఉచితంగా పరీక్షలు చేయించుకునే రోగుల నుంచి వేలల్లో డబ్బులు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు టీ-హబ్‌ సిబ్బంది మాత్రం నేరుగా నమూనాలు తీసుకోవడంలేదని చెబుతూనే.. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు కొన్ని పరీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

మేము జిల్లాలోని 27 పీహెచ్​సీల నుంచి మాత్రమే నమూనాలు తీసుకుంటున్నాము. వాటి ఫలితాలను ఆన్​లైన్​లో పొందుపరిచి.. సాయంత్రంలోపు నివేదికలను ప్రత్యేక వాహనాల ద్వారా ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాము. -శ్రీనివాస్‌, ఎల్‌టీ, టీ-హబ్‌

కేంద్రంలో నిబంధనల మేరకు పీహెచ్‌సీల నుంచి బార్‌కోడ్‌తో వచ్చే నమూనాలకు మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఇక్కడ అక్రమాలు జరగకుండా నిఘా కెమెరాలను సైతం ఏర్పాటు చేశాం. ఒకవేళ ఎవరైనా ప్రైవేటు వారు, ప్రైవేటు ల్యాబ్‌ల వ్యక్తులు వచ్చి నమూనాలకు పరీక్షలు చేసుకున్నట్లు రుజువైతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నేరుగా నమూనాలకు పరీక్షలు చేయటానికి వీల్లేదు. -డా.సాధన, టీ హబ్‌ నోడల్‌ అధికారి

రోగులు.. ప్రైవేటు వైద్యులు సూచించిన పరీక్షలను దగ్గరలోని పీహెచ్‌సీ, అర్బన్‌హెల్త్‌ కేంద్రానికి వెళ్లి నమూనాలు ఇచ్చి టీ-హబ్‌కి పంపించవచ్చని నోడల్‌ అధికారి డా.సాధన చెబుతున్నారు. అంతేకాదు నేరుగా నమూనాలు సేకరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. టీహబ్‌ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

ఎంతో సదుద్దేశంతో అందుబాటులోకి తెచ్చిన టీ హబ్‌ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు కళకళలాడతాయి. ప్రజల జేబులకు చిల్లులు పడవు. ఆ దిశగా అడుగులు పడాలి.

ఆదిలాబాద్​ టీ హబ్​లో ప్రైవేటు వ్యక్తుల దందా

ఇదీ చదవండి:కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ

ABOUT THE AUTHOR

...view details