ఆ పాఠశాలలోకి అడుగుపెట్టగానే ఎర్రటి రంగుతో కనిపించేంది రైలిజింన్ కాదు. ఆ వెనుకే వరుసగా ఉన్నవి బోగీలు కాదు. రైలులాంటి బడి మాత్రమే. దానిపై రాసి ఉన్న సంఖ్య... ఆ పాఠశాల రిజిస్టర్ నంబరు. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల సమీపంలోని ఎన్జీఓ పాఠశాలకు వెళ్తే ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. రూ. 40 వేలు ఖర్చుచేసి పిల్లల్ని ఆకర్షించడానికి ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం... కరోనా కారణంగా విద్యార్థుల దరిచేరడం లేదు.
రైలుబండిగా...
ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థులుంటే 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తరగతి గదులు ఒకదానిని ఆనుకుని వరుసగా ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ ప్రత్యేక చొరవతో రైలు డబ్బాలుగా రంగు వేయించారు. ముందున్న తరగతి గదికి ఎర్రరంగు వేసి దానిపై పాఠశాల రిజిష్టర్ నంబర్ను అచ్చం ఇంజిన్లా తయారుచేసి రైలుబండిగా మార్చేశారు.