తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ: బండి సంజయ్‌ - Arjunmunda latest news

Bandi Sanjay Fires on KCR: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేస్తామని కేంద్రమంత్రి అర్జున్‌ముండా హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదివాసీలను అందలమెక్కిస్తే... కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్‌ వారి హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. నాగోబా జాతరకు హాజరైన అర్జున్‌ముండా, బండి సంజయ్‌కు మెస్రం వంశీయులు వారి సంప్రదాయాల ప్రకారం సాదరస్వాగతం పలికారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Jan 22, 2023, 7:42 PM IST

బీఆర్‌ఎస్‌ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ: బండి సంజయ్‌

Bandi Sanjay Fires on KCR: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో కలిసి కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అర్జున్‌ ముండా హాజరయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు మెస్రం వంశీయులు సాదర స్వాగతం పలికారు. విశేష చరిత్ర కలిగిన మెస్రం వంశీయులు భక్తిప్రపత్తులతో జరుపుకునే నాగోబా జాతరకు రావడం సంతోషంగా ఉందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ముండా హర్షం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోంది:ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు న్యాయం జరిగేందుకు ఎంతో కృషిచేస్తుందని కేంద్రమంత్రి అర్జున్‌ముండా వివరించారు. తన దృష్టికి తెచ్చిన ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆక్షేపించారు.

బీజేపీ నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మొహం చెల్లకనే.. బీఆర్‌ఎస్ పేరుతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమం మరిచిన ముఖ్యమంత్రి.. బీజేపీ నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు .

బీఆర్‌ఎస్‌ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ: బీఆర్‌ఎస్‌ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఆదివాసీల సంక్షేమం, పోడు భూములకు పట్టాలు తదితర అంశాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బీజేపీ సర్కార్‌లో నాగోబా జాతరను అధికారికంగా జరపడంతో పాటు పండగలకు ప్రత్యేక నిధులిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు.

"జల్‌,జమీన్‌, జంగిల్‌ ఆదివాసీలకేనంటూ వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం అమలుచేయకపోవడం బాధాకరం. పోడుభూములకు పట్టాలు ఇవ్వకుండా ఆదివాసీలను కేసీఆర్‌ సర్కార్‌ ఏడిపిస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవుల్లో నివసించే గిరిజనానికి అడవులు, పోడు భూములపై సంపూర్ణ అధికారం ఉంటుంది. చట్టాన్ని అనుసరించి అడవిబిడ్డలకు వ్యక్తిగతంగా భూ పట్టాలతో పాటు సామూహికంగా ప్రజలందరికీ హక్కులు కల్పించాలి. ఇలాంటి చట్టాన్ని తెలంగాణలో అమలుచేయకపోవడం ఆదివాసీలకు తీరని నష్టమే. మీరేం కలత చెందకండి. రాష్ట్రంలో రాబోయే భాజపా సర్కార్‌ అటవీ హక్కుల చట్టం అమలుచేసి తీరుతుందని మీకు హామీ ఇస్తున్నా." - అర్జున్‌ముండా, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

"కేసీఆర్ చాలా బిజీగా ఉంటారు. పోడు భూముల సమస్య అలాగే ఉంది. బీజేపీ నాయకులను ఏవిధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశారో కేసీఆర్ చెప్పాలి. బీఆర్ఎస్ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ. ఖమ్మం సభలో కేసీఆర్‌ తెలంగాణ ఊసే ఎత్తలేదు." -బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం.. ఈ నెల 28న ముగింపు!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ టార్గెట్ అదేనా..? అందుకే వారికి దూరంగా..!

ABOUT THE AUTHOR

...view details