కూతురి సంతోషం కోసం నానా తంటాలు పడైనా సరే.. అల్లుడు కోరుకున్న వాహనాన్ని కట్నంగా ఇస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు. కానీ ఆదివాసీలు మాత్రం.. అందుకు భిన్నంగా ఎడ్ల బండ్లను ఇస్తున్నారు. జీవనోపాధికి ఉపయోగపడుతుందనే కారణంతో.. ఆ నూతన వరుడూ దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాడు. వివాహం అనంతరం.. జరిగే ఈ అరుదైన వేడుకను చూడాలంటే ఆదిలాబాద్కు వెళ్లి తీరాలి.
ఆదివాసీలు.. పెళ్లిల్లో కట్నాలు ఇవ్వరు. వారి సంప్రదాయం ప్రకారం.. ముందుగా ఆడపిల్లకు వివాహం జరిపించి అత్తవారింటికి పంపుతారు. ఆ తర్వాత వచ్చే మొదటి దీపావళి పండుగకు నూతన వధూవరులను పిలుస్తారు. వారికి తోచిన వస్తువులను ఇచ్చి పంపుతారు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతున్నా.. ప్రస్తుతం వీరు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.