ఆట ఏదైనా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. దాంతో పాటు దాయాదుల మధ్య పోరును చూసేందుకు ఎంతోమంది క్రీడాఅభిమానులు ఆశగా ఎదురుచూస్తారు. 1964 తర్వాత డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఒక్క సీనియర్ అథ్లెట్ కూడా పాకిస్థాన్లో అడుగుపెట్టలేదు. లాహోర్ వేదికగా 2007 నవంబరులో చివరిసారిగా పాకిస్థాన్ వేదికగా ఫ్రెండ్షిప్ సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎలాంటి క్రీడా టోర్నీలు జరగలేదు.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అండర్-12 బాలబాలికల టెన్నిస్ టోర్నీని పాకిస్థాన్ నిర్వహించింది. పాక్లో జరుగుతున్న ఆసియా అండర్-12 ఐటీఎఫ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు 8 మంది భారత టెన్నిస్ క్రీడాకారులు వెళ్లారు. శత్రుదేశంగా పరిగణించే పాక్లో తమకు గౌరవ మర్యాదలకు ఎలాంటి ఢోకా లేదని భారత బృందానికి చెందిన కోచ్లు అంటున్నారు. తమ బృందాన్ని పాక్ అధికారులు ఎంతో ప్రత్యేకంగా పరిగణిస్తున్నారని తెలిపారు.
బాలుర జట్టులో ఆరవ్ చావ్లా, ఓజాస్ మెహ్లావత్, రుద్ర భాతమ్ ఉండగా.. బాలికల టీమ్లో మాయా రేవతి, హర్షిత శ్రీ వెంకటేశ్, జాన్హవీ కజ్లా ఉన్నారు. అయితే 2007లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్లో పాల్గొన్న నేషనల్ టెన్నిస్ ఛాంపియన్ అశుతోష్ సింగ్ బాలుర జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్లో తమకు అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
"ఈ టోర్నీలో పాల్గొనేందుకు దోహా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత.. మా జెర్సీలపై ఉన్న తివర్ణ పతాకాన్ని చూసిన ఓ బృందం ఎంతో ఆసక్తిగా గమనించింది. వాళ్లు మాతో మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం కనబరిచారు. మేం ఇస్లామాబాద్ వెళ్లేందుకు అక్కడున్న ఇమిగ్రేషన్ డెస్క్కు చేరుకునే లోపే పాకిస్థాన్ టెన్నిస్ సమాఖ్య మాకు క్లియరెన్స్ తీసుకుంది. హోటల్ చేరుకునే వరకు ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్లో భద్రతా సమస్యలేమి మాకు తలెత్తలేదు. క్రీడాకారుల తల్లిదండ్రులూ ఎంతో ధైర్యంగా ఉన్నారు. టెన్నిస్ క్రీడతో రాజకీయాలతో పోల్చలేదు".