తెలంగాణ

telangana

డేవిస్​ కప్​: పాక్​ ఆతిథ్యం భారత్​ స్వీకరిస్తుందా?

By

Published : Aug 9, 2019, 1:05 PM IST

పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​ వేదికగా సెప్టెంబర్​ 14,15 తేదీల్లో ప్రతిష్టాత్మక డేవిస్​ కప్​ జరగనుంది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాల్గొనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కశ్మీర్​ విషయపై ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణం.

డేవిస్​ కప్

పాకిస్థాన్​లో జరగనున్న ప్రతిష్టాత్మక డేవిస్​ కప్ టోర్నీలో భారత్​ పాల్గొననుందా..? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ కోసం దాయాది దేశంలో పర్యటించాలనుకుంది భారత టెన్నిస్​ జట్టు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందిగ్ధం నెలకొంది.

కశ్మీర్ అంశం కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టు భద్రత గురించి ఆలోచించాలని స్టార్​ ప్లేయర్​ మహేశ్​ భూపతి... ఇటీవల భారత్ టెన్నిస్ సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అతడితో పాటు రోహన్​ బోపన్న, ఆటగాళ్ల రక్షణ విషయంలో సందేహం వ్యక్తం చేశాడు.

'భద్రతా దృష్ట్యా భయాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు'.
- బోపన్న, భారత్​ టెన్నిస్ ప్లేయర్

క్రీడాకారులు లేవనెత్తిన సందేహాలపై స్పందించాడు పాక్​ టెన్నిస్ జట్టు కెప్టెన్​ ఖురేషి.

"భద్రత అంశం ఎప్పుడూ ముఖ్యమే. అయితే మీరు ఎవరో చెప్పిన మాటలు విని పాక్​ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకసారి వచ్చి చూస్తే కదా మేం ఇచ్చే రక్షణ గురించి తెలుస్తుంది. మీరు స్వయంగా మా ఆతిథ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. భవిష్యత్తు గురించి ఎవరూ చెప్పలేం. పాకిస్థాన్​ ప్రేమించే దేశమని.. ఇక్కడ ప్రజలు అభిమానంతో ఉంటారని అందరూ అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మీరు అనుకున్నట్లే ఘటనలు జరుగుతున్నాయి. ఆ కారణంగా మమ్మల్ని తప్పుపట్టొద్దు".
-ఐసమ్​ ఉల్​ హుక్​ ఖురేషి, పాక్​ టెన్నిస్ జట్టు కెప్టెన్

ఇస్లామాబాద్ వేదికగా డేవిస్​ కప్​కు అనుమతిచ్చింది అంతర్జాతీయ టెన్నిస్ సంఘం. ఈ టోర్నీకి సంబంధించిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా... అన్నింటిలోనూ భారత టెన్నిస్ సంఘానికి పూర్తి బాధ్యతలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ టోర్నీ ఇరుదేశాలకు చెందింది కాదని.. అంతర్జాతీయంగా జరగుతుందనే కారణంతోనే భారత్​ ఇందులో పాల్గొనటానికి అంగీకరించింది.

డేవిస్​ కప్

ఎంపిక పూర్తి....

డేవిస్‌ కప్‌ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది భారత టెన్నిస్​ సంఘం. ఆరుగురు సభ్యులతో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. సింగిల్స్‌ విభాగంలో భారత టాప్‌ క్రీడాకారులు ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామ్​నాథన్‌, సాకేత్ మైనేని​ ఎంపికయ్యారు. డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడి చోటు దక్కించుకుంది.

ఇదీ చూడండి: లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

ABOUT THE AUTHOR

...view details