1988 సియోల్ ఒలింపిక్స్(Olympics) నుంచి ఆర్చరీలో(Archery) పతకం కోసం భారత దండయాత్ర మొదలైంది. అప్పటి నుంచి ఈ విశ్వ క్రీడలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ బాణం గురి మాత్రం కుదరలేదు. ఇప్పటివరకు ఏడు ఒలింపిక్స్ల్లో ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈసారి టోక్యోలో కచ్చితంగా పతకం వస్తుందనే అంచనాలున్నాయి. మన ఆర్చరీ బృందం పటిష్ఠంగా ఉండడమే కారణం. నలుగురు ఆర్చర్లు మొత్తం నాలుగు విభాగాల్లో పతకాల కోసం బరిలో దిగనున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి(Deepika Kumari), పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ తలపడనుండగా.. పురుషుల జట్టుతో పాటు మిక్స్డ్ టీమ్లోనూ మన ఆర్చర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వీళ్లపైనా అంచనాలు
మూడోసారి ఒలింపిక్స్లో ఆడబోతున్న వెటరన్ ఆర్చర్, 37 ఏళ్ల తరుణ్దీప్ తన కెరీర్కు ఘనంగా ముగింపు పలకాలనే ధ్యేయంతో ఉన్నాడు. సెలక్షన్ ట్రయల్స్లో అతాను, ప్రవీణ్ తర్వాత మూడో స్థానంలో నిలిచి టోక్యో విమానం ఎక్కే అవకాశం కొట్టేసిన అతను.. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతాలు గెలవడం సహా రెండు ఆసియా క్రీడల పతకాలూ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రెండోసారి ఒలింపిక్స్లో అడుగుపెట్టబోతున్న దేశంలోని అగ్రశ్రేణి ఆర్చర్లలో ఒకడైన 29 ఏళ్ల అతాను పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్న అతను పారిస్ ప్రపంచకప్ టోర్నీలో స్వర్ణంతో గొప్ప ఫామ్లో ఉన్నాడు. పదేళ్ల క్రితం వరకూ ఆర్చరీ అంటేనే ఏమిటో తెలీని 25 ఏళ్ల ప్రవీణ్ ఇప్పుడు ఒలింపిక్స్ అరంగేట్రం చేయనున్నాడు. వ్యక్తిగత విభాగంలో వేర్వేరుగా పోటీపడే ఈ ముగ్గురు ఆర్చర్లు.. పురుషుల జట్టు విభాగంలో కలిసికట్టుగా దేశానికి పతకం అందించే దిశగా సాగాలనే పట్టుదలతో ఉన్నారు.