టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా.. ఆర్చరీలో దీపిక కుమారి, వెయిట్ లిఫ్టింగ్లో మీరాభాయ్ ఛాను, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరంతా మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత కొన్ని ఒలింపిక్స్లతో పోలిస్తే ఈ విశ్వ క్రీడలకు ముందు భారత పురుషుల హాకీ జట్టు కూడా అత్యుత్తమ ఫామ్లో ఉండటం కలిసివచ్చే అంశం.
రెజ్లింగ్లో పక్కా..
స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్లో తొలి వ్యక్తిగత పతకం దక్కింది రెజ్లింగ్లోనే. ఆ తర్వాత అర్ధశతాబ్దం పాటు ఆ ఆటలో మరో పతకం సొంతం కాలేదు. కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ప్రతిసారి విశ్వక్రీడల్లో రెజ్లింగ్లో కనీసం ఒక్క పతకమైనా భారత ఖాతాలో చేరుతోంది. ఈ సారి కూడా టోక్యోలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా వస్తాయనే అంచనాలున్నాయి. ఈసారి మొత్తం ఏడుగురు రెజ్లర్లు పతకం కోసం బరిలో దిగనున్నారు. 2016 ఒలింపిక్స్ క్వార్టర్ఫైనల్లో గాయంతో విలవిలలాడుతూ దేశానికి పతకం అందించే అవకాశం కోల్పోయానని కన్నీళ్లు పెడుతూ మ్యాట్ నుంచి నిష్క్రమించిన వినేశ్ ఫొగాట్.. టోక్యోలో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉంది.
53 కిలోల విభాగంలో టాప్సీడ్గా బరిలో దిగుతున్న ఆమె.. ఈ ఏడాది పోటీపడ్డ ఒక్క టోర్నీలోనూ ఓడిపోలేదు. స్వర్ణంతోనే తిరిగి వస్తుందని వినేశ్పై ప్రజల్లో నమ్మకం ఉంది. ఇక టీనేజీ సంచలనాలు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో బజ్రంగ్ పునియా ప్రధాన ఆకర్షణ. కొన్నేళ్ల నుంచి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనతో తనపై అంచనాలను అతను పెంచేశాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ఆసియా, ప్రపంచ ఛాంపియన్షిప్ల్లో పతకాలతో అతను ప్రపంచ అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 65 కేజీల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్గా టోక్యోలో అడుగుపెట్టబోతున్న ఈ రెజ్లర్కు ఈ విభాగంలో కఠినమైన పోటీ ఎదురు కానుంది. 2018లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 22 ఏళ్ల దీపక్ పునియాపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
ఆర్చర్లు..
గత కొంత కాలంగా ప్రపంచకప్ టోర్నీలతో పాటు వివిధ అంతర్జాతీయ పోటీల్లో గొప్ప ప్రదర్శన చేసిన ఆర్చర్లు టోక్యో ఒలింపిక్స్లో తమపై ఆశలు పెట్టుకునేలా చేశారు. టోక్యోలో నలుగురు ఆర్చర్లు మొత్తం నాలుగు విభాగాల్లో పతకాల కోసం బరిలో దిగనున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ తలపడనుండగా పురుషుల జట్టుతో పాటు మిక్స్డ్ టీమ్లోనూ మన ఆర్చర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.