నేపాల్లో సోమవారం ఘనంగా ప్రారంభమైన దక్షిణాసియా క్రీడల్లో(శాగ్) భారత్ శుభారంభం చేసింది. తొలిరోజు ఓ స్వర్ణం, రెండు రజతాలు సహా ఓ కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ నాలుగు పతకాలు ఒకే ఈవెంట్లో రావడం విశేషం.
ట్రైథ్లాన్(మూడు క్రీడలు కలిపి) ఈవెంట్ పురుషుల విభాగంలో ఎమ్.ఎన్ సినిమోల్.. భారత్కు తొలి స్వర్ణాన్ని అందించాడు. ఇదే విభాగంలో రెండో స్థానంలో నిలిచిన బిశ్వర్జీత్ శ్రీఖోమ్ రజతాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళా విభాగంలో సరోజిని దేవి.. రజతం, మోహన్ ప్రజ్ఞ్యా.. కాంస్యం దక్కించుకున్నారు.
ట్రైథ్లాన్ ఈవెంట్ అంటే?
ట్రైథ్లాన్లో ముఖ్యంగా మూడు పోటీలు ఉంటాయి. 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల బైక్ రేసింగ్, 5 కి.మీ పరుగు పందెం నిర్వహిస్తారు. ఒకదాని తర్వాత ఒకటి మూడు పోటీల్ని పూర్తి చేయాలి.
సినిమోల్.. గంట 2 నిమిషాల 51 సెకన్లులో ఈ ఈవెంట్ను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు. బిశ్వర్జీత్.. గంట 2 నిమిషాల 59 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. నేపాల్కు చెందిన బసంతా తరు మూడో స్థానంతో సరిపెట్టుకొని కాంస్యం సొంతం చేసుకున్నాడు.
మహిళల వ్యక్తిగత విభాగంలో సరోజిని.. గంట 14 నిమిషాల సమయంలో ఈ ఈవెంట్ను పూర్తి చేసింది. ప్రజ్ఞ్యా.. గంట 14 నిమిషాల 57 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. నేపాల్కు చెందిన సోనీ గురుంగ్.. గంట 13 నిమిషాల 45 సెకన్లతో పసిడి కైవసం చేసుకుంది.
దక్షిణాసియా క్రీడల్లోభారత్ నుంచి 15 విభాగాల్లో 487 అథ్లెట్లు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం సహా 9 మెడల్స్తో పతకాల పట్టికలో నేపాల్ అగ్రస్థానంలో ఉంది.
ఇదీ చదవండి: ఘనంగా రెజ్లర్ బబిత వివాహం.. హాజరైన ప్రముఖులు