తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2020, 8:11 AM IST

ETV Bharat / sports

ఆకలి కష్టాల నుంచి 'అర్జున' అవార్డు వరకు!

ఈ ఏడాది అర్జున అవార్డుకు ఎంపికైన భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్​ సారిక కాలె.. ఆట కోసం తను ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. కొన్నేళ్ల పాటు ఒక్కపూట భోజనంతోనే కడుపు నింపుకున్నట్లు తెలిపింది.

sarika kale
సారిక కాలె

దాదాపు 10 ఏళ్ల పాటు రోజులో ఒక్క పూట మాత్రమే తిండి తిని గడిపానని.. అలాంటి తన జీవితాన్ని ఆట మార్చిందని భారత మహిళల ఖోఖో మాజీ కెప్టెన్‌ సారిక కాలె చెబుతోంది. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టును స్వర్ణం దిశగా నడిపించిన ఈ మాజీ క్రీడాకారిణికి.. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అర్జున' పురస్కారాల జాబితాలో చోటు దక్కింది. ఈ క్రమంలోనే సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆట తాలూకు అనుభవాలను గుర్తుచేసుకుంది.

సారిక కాలె

"ఈ ఏడాది అర్జున అవార్డుకు ఎంపికైనప్పటికీ నేను ఖోఖో ఆడే రోజులే ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేదాన్ని. మా కుటుంబ పరిస్థితులే అందుకు కారణం. మా అమ్మ దుస్తులు కుట్టేది. మా నాన్న దివ్యాంగుడు. కుటుంబ ఆదాయం అంతంత మాత్రమే కావడం వల్ల.. మేమంతా నానమ్మ, తాతయ్య సంపాదన మీదే ఆధారపడేవాళ్లం. ఆ రోజుల్లో మాకు తినడానికి ఒక్క పూట భోజనం మాత్రమే ఉండేది. ఆ కష్టాల నుంచి బయటపడేందుకే ఆటను ఎంచుకున్నా. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. శిక్షణ శిబిరంలో ఉన్నపుడు లేదా ఏదైనా టోర్నీకి వెళ్లినపుడే నాకు ప్రత్యేకమైన ఆహారం దొరికేది" అని సారిక వివరించింది.

ఖోఖో క్రీడలో విశేష ప్రతిభ చూపిన సారిక.. ప్రస్తుతం మహారాష్ట్రలోని తుల్జాపుర్‌లో క్రీడా అధికారిగా పని చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details