దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలు) పతకాలు సాధించి అగ్రస్థానంతో టోర్నీని ఘనంగా ముగించింది. ఈ పోటీల చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
గతంతో పోలిస్తే స్వర్ణాలు తక్కువే..
2016లో గువాహటితో జరిగిన పోటీల్లో మన బృందం 309 పతకాలతో (189 స్వర్ణ, 90 రజత, 30 కాంస్యాలు) నెలకొల్పిన రికార్డు ఈ ఘనతతో బద్దలైంది. అయితే గత క్రీడలతో పోలిస్తే ఈసారి పదిహేను స్వర్ణాలు తగ్గాయి. తాజా పోటీల్లో ఆతిథ్య నేపాల్ 206 పతకాలతో (51 స్వర్ణ, 60 రజత, 95 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది.
బాక్సింగ్లో 12 పతకాలు..
పోటీల చివరి రోజైన మంగళవారం భారత్ 18 (15 స్వర్ణ, 2 రజత, 1 కాంస్యం) పతకాలు ఖాతాలో వేసుకుంది. బాక్సింగ్లో మరో ఆరు స్వర్ణాలు సొంతమయ్యాయి. వికాస్ కృష్ణన్ (69 కేజీలు), పింకీరాణి (51 కేజీలు), స్పర్శ్ కుమార్ (52 కేజీలు), నరేందర్ (91 కేజీల పైన), సోనియా (57 కేజీలు), మంజు (64 కేజీలు) ఫైనల్లో గెలిచి స్వర్ణాలు సాధించారు. బాక్సింగ్లో మొత్తం భారత్ 12 పసిడి పతకాలు గెలిచింది.
స్క్వాష్, బాస్కెట్బాల్లో పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో భారత్ స్వర్ణాలు సొంతం చేసుకుంది. 1984లో దక్షిణాసియా క్రీడలు ఆరంభమైనప్పటి నుంచి ప్రతిసారీ భారత్దే అగ్రస్థానం.
ఇదీ చదవండి: 'వరల్డ్ టూర్ ఫైనల్స్' లో సింధు పవర్ చూపిస్తుందా?