ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగమ్మాయి.. మొత్తం మీద భారత అయిదో బాక్సర్.. ఇదీ ఇప్పుడు మన నిఖత్ జరీన్ రికార్డు. ఆమె సాధించిన విజయంతో దేశం ఉప్పొంగిపోతోంది. ఇప్పుడామె గెలుపు గొప్ప కిక్కునిస్తోంది. కానీ ఇక్కడివరకు ఆమె ప్రయాణం ఎన్నో ఒడుదొడుకులతో సాగింది. సవాళ్ల బాటలోనే ఆమె సవారీ చేసింది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. అడ్డంకులు పలకరించినా.. బాక్సింగ్పై ప్రేమను వదులుకోలేదు. రింగ్లో ప్రత్యర్థులతో.. బయట సవాళ్లతో పోరాడింది. రెండు చోట్లా విజయాలు సాధించి అస్సలు తగ్గేదేలే అని చాటింది. అడుగడుగునా అడ్డంకులు.. వేలాకోళాలు.. విమర్శలతో ఎదురు దాడి.. ఎగతాళి వ్యాఖ్యలు.. కానీ ఆమె ఆగలేదు. రింగ్లో సివంగిలా.. ప్రత్యర్థులకు సింహస్వప్నంలా.. పంచ్లతో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆరంభం నుంచే..:నిఖత్ చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేది. ఆటలంటే ఇష్టం పెంచుకుంది. పాఠశాల స్థాయిలో అథ్లెటిక్స్లో మెరిసింది. అయితే అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ చేయకూడదు అనే ప్రశ్నతో తన జీవితమే మారిపోయింది. ఆమె అడుగులు బాక్సింగ్ వైపు పడ్డాయి. అప్పుడే సవాళ్లూ స్వాగతించాయి. ముందుగా రింగ్ బయటే ఆమెకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కుటంబ కట్టుబాట్లు ఓ వైపు.. ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకంటూ వినిపించే మాటాలు మరోవైపు.. ముఖం మీద గాయాలైతే ఎవరూ పెళ్లి చేసుకోరనే వ్యాఖ్యలు ఇంకోవైపు. ఇలా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆమె ఆగలేదు. తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ ఆమెకు అండగా నిలిచాడు. తనయను ఛాంపియన్గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అబ్బాయిలతోనే కలిసి ఆమె ప్రాక్టీస్ చేసేది. వాళ్లతోనే తలపడేది. షంసముద్దీన్ (బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ తండ్రి) దగ్గర శిక్షణ తీసుకునేది. షార్ట్లు, స్లీవ్లెస్ టాప్స్ వేసుకుని ప్రాక్టీస్ చేయాల్సి రావడం వల్ల ఓ వర్గం నుంచి నిఖత్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆమె ముందుకు సాగింది. సంప్రదాయాలు..కట్టుబాట్ల విషయాల్లో ఎదురయ్యే మాటలు, విమర్శలను వారు లెక్కచేయలేదు.
పడి లేచింది..:క్రీడల్లో రాణించాలంటే పెద్ద పెద్ద నగరాల్లో అత్యుత్తమ వసతుల మధ్య శిక్షణ తీసుకోవాలి అనే మాటలు తప్పని నిఖత్ నిరూపించింది. తపన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని చాటిచెప్పింది. నిజామాబాద్లోనే అరకొర వసతుల మధ్య సాధన చేసిన ఆమె బాక్సింగ్పై పట్టు సాధించింది. రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. 2010 జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్లోస్వర్ణంతో అదరగొట్టింది. విశాఖపట్నంలోని సాయ్ శిబిరంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర రావు శిక్షణలో మరింత రాటుదేలింది. 2011లో 15 ఏళ్లకే జూనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. చిరంజీవి దగ్గర మెళకువలు నేర్చుకుంది. సీనియర్ స్థాయిలోనూ మెరిసింది. దీంతో భారత బాక్సింగ్కు మరో స్టార్ దొరికినట్లేనని అంతా అనుకున్నారు. కానీ నిఖత్ పోటీపడే 52 కేజీల విభాగంలోనే అప్పటికే దిగ్గజం మేరీకోమ్ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. అది తనకు పెద్ద అడ్డంకిగా మారింది.