ఒలింపిక్స్లో పతకం గెలవలేదు.. ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ విజేతగా నిలవలేదు.. కానీ ఇవి సాధించిన క్రీడాకారుల్ని మించి గౌరవం దక్కించుకున్న అరుదైన అథ్లెట్ ఆయన!
కేవలం పతకాలతో కొలిచే ఔన్నత్యం కాదు మిల్కాది. అవే ప్రమాణాలైతే ఆటకు గుడ్బై చెప్పిన అర శతాబ్దం తర్వాత కూడా మిల్కా గురించి దేశం గొప్పగా మాట్లాడుకునేది కాదు. కళ్ల ముందే తల్లిదండ్రులు హత్యకు గురైతే.. బతుకు జీవుడా అనుకుంటూ దేశం దాటి ఇంకో దేశానికి వచ్చి.. కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడి.. ఒక దశలో దొంగతనాలు కూడా చేసిన వ్యక్తి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది నుంచి కన్నీటి నివాళి అందుకోవడం వెనుక ఒక అసాధారణ ప్రయాణం ఉంది. బాల్యంతో మొదలు పెడితే.. ప్రతి దశలోనూ ఎదురైన పెద్ద పెద్ద అడ్డంకుల్ని దాటుతూ మిల్కా ముందుకు సాగిన వైనం స్ఫూర్తిదాయకం.
విభజనకు ముందు భారత్లోనే ఉండి, తర్వాత పాకిస్థాన్లో అంతర్భాగంగా మారిన పంజాబ్లో ఓ సిక్కు కుటుంబంలో పుట్టాడు మిల్కా. అప్పట్లో సరైన వైద్య సదుపాయాలు లేక మిల్కా తోబుట్టువులు 8 మంది పసిబిడ్డలుగా ఉండగానే చనిపోయారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లలో మిల్కా కళ్ల ముందే అతడి తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు హత్యకు గురయ్యారు. అతడి బంధువర్గంలోనూ చాలామంది మరణించారు. కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయి.. ఉన్న ఊరిని విడిచిపెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించి వేరే దేశంగా మారిన ప్రాంతానికి రావాల్సి వస్తే ఆ 17 ఏళ్ల కుర్రాడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విభజన సమయంలో తలెత్తిన అల్లర్ల కారణంగా రక్తంతో తడిసి ముద్దయిన రైలు బండిలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేసి దిల్లీకి చేరుకున్నాడు మిల్కా. అక్కడ శరణార్థి శిబిరంలోనే చాన్నాళ్ల పాటు అతను, తన సోదరి, ఆమె భర్త బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత దిల్లీలోనే స్థిరపడ్డప్పటికీ.. ఆర్థికంగా ఏ ఆధారం లేక దుర్భరంగానే సాగింది మిల్కా జీవనం.
బూట్పాలిష్లు.. దొంగతనాలు
శరణార్థి శిబిరంలో ఉండగా మిల్కా కడుపు నింపుకోవడం కోసం కొంత కాలం బూట్ పాలిష్లు చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయి, ఉన్న ఊరిని విడిచి పెట్టి వచ్చేశాక మిల్కా చదువు అటకెక్కేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించిన అతను.. తర్వాత దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఒక గ్యాంగ్లో చేరి గూడ్స్ బండిలో వచ్చే ధాన్యం, ఇతర ఆహార పదార్థాలను దొంగిలించడం పనిగా పెట్టుకున్నాడు. ఒకసారి దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు మిల్కా. అతణ్ని బయటికి తేవడం కోసం తన సోదరి తన బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో తర్వాత మిల్కా దొంగతనాలు మానేశాడు. గౌరవంగా బతకడం కోసం సైన్యంలో చేరడానికి ప్రయత్నించాడు. మూడుసార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ.. నాలుగోసారి అతడి లక్ష్యం నెరవేరింది.
గ్లాసు పాలు ఇస్తారని..
మిల్కా అథ్లెటిక్స్లోకి అడుగు పెట్టడం చిత్రంగా జరిగింది. సైన్యంలో చేరి సికింద్రాబాద్లో పోస్టింగ్ తెచ్చుకున్నాక అక్కడ శిక్షణ పొందుతున్న క్రమంలో ఆర్మీ కోచ్ గురుదేవ్ సింగ్.. మిల్కా, అతడి సహచరులను అయిదు మైళ్ల క్రాస్ కంట్రీ రేసుకు ఆహ్వానించాడు. తాను పెట్టే పందెంలో టాప్-10లో నిలిచిన వారికి రోజూ అదనంగా ఒక గ్లాసు పాలు ఇస్తానని ప్రకటించాడు. అదనపు పాల మీద ఆశతోనే జోరుగా పరుగెత్తి ఆరో స్థానంలో నిలిచాడు. తర్వాత శిక్షణలో భాగంగా మిల్కా ప్రతిభ చూసి 400 మీటర్ల పరుగు అతడికి నప్పుతుందని అందులోకి దించాడు కోచ్.
‘ఫ్లయింగ్ సిఖ్’ అలా వచ్చింది
రోమ్ ఒలింపిక్స్ వైఫల్యం మిల్కాను కుంగదీసింది. కొంత కాలం పాటు అతను పోటీలకు దూరంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఇండో-పాక్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ పోటీల కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు మిల్కా నిరాకరించాడు. పాక్కు వెళ్తే తన తల్లిదండ్రుల హత్య తాలూకు చేదు అనుభవాలు వెంటాడుతాయన్న భయమే అందుక్కారణం. అయితే స్వయంగా భారత ప్రధాని నెహ్రూ మిల్కాతో మాట్లాడి ఆ పోటీలకు వెళ్లేలా ఒప్పించాడు. అక్కడ ఆసియాలోనే ఉత్తమ స్ప్రింటర్లలో ఒకడిగా పేరున్న అబ్దుల్ ఖాలిఖ్ను 400 మీటర్ల రేసులో ఓడించి మిల్కా తన సత్తాను చాటిచెప్పాడు. ఆ రేసులో మిల్కా పరుగెత్తిన తీరుకు ముగ్ధుడైన పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్.. అతడికి ‘ఫ్లయింగ్ సిఖ్’ అనే బిరుదునిచ్చాడు. 1960లో జరిగిన ఈ రేసు తర్వాత మిల్కా ఇంకో నాలుగేళ్లు ఆటలో కొనసాగాడు. 1964 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీ, 4×400 మీ. రిలే రేసుల్లో స్వర్ణాలు సాధించాక ట్రాక్కు టాటా చెప్పాడు. మిల్కా జీవితంలో ఇంత నాటకీయత, ఇన్ని మలుపులు, ఇంత ఔన్నత్యం ఉన్నాయి కాబట్టే ‘బాగ్ మిల్కా బాగ్’ పేరుతో ఆయనపై ఓ సినిమా తెరకెక్కింది. భావోద్వేగాలను తట్టి లేపి మిల్కా మీద గౌరవభావాన్ని తీసుకొచ్చే చిత్రమిది.