తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వెయిట్​ లిఫ్టింగ్​కు నా అకాడమీ చిరునామాగా మారాలి'

ఒలింపిక్స్​లో పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్​గా గుర్తింపు తెచ్చుకున్నారు కరణం మల్లీశ్వరి. ఆమె పతకం సాధించి సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఓ వెబినార్​లో మాట్లాడుతూ.. వెయిట్​ లిఫ్టింగ్​ను కెరీర్​గా ఎంచుకునే వారికి మల్లీశ్వరి అకాడమీ చిరునామాగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే అకాడమీ ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే హైదరాబాద్​లోనూ అకాడమీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు మల్లీశ్వరి.

By

Published : Sep 21, 2020, 7:21 AM IST

Karnam Malleswari became India's first woman Olympic medalist on this day
'వెయిట్​ లిఫ్టింగ్​కు నా అకాడమీ చిరునామాగా మారాలి'

అది 2000 సిడ్నీ ఒలింపిక్స్‌.. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 69 కేజీల విభాగంలో పోటీలు జరుగుతున్నాయి.. పతకమే లక్ష్యంగా బరిలో దిగిన తెలుగమ్మాయి మొత్తం 240 కిలోల బరువెత్తి (స్నాచ్‌లో 110, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 130 కేజీలు) కాంస్యం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. పోడియంపై నిల్చుని త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన ఆ వీర వనిత పేరు.. కరణం మల్లీశ్వరి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి.. ఒలింపిక్స్‌లో పతకం వరకూ చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆ అద్భుతం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెబినార్‌లో మాట్లాడుతూ ఆమె ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

ఒలింపిక్స్‌ పతకం సాధించి అప్పుడే రెండు దశాబ్దాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని మల్లీశ్వరి తెలిపింది. టీ స్పోర్ట్స్‌ హబ్‌, మల్లీశ్వరి ఫౌండేషన్‌ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడుతూ.. "1994లో 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాతి ఏడాది కూడా పసిడి సాధించా. దీంతో స్వర్ణమే లక్ష్యంగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టా. పోటీల రోజు పొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకుని వేదికకు చేరుకున్నా. ఒక్కసారి పోటీపై దృష్టిపెడితే ఇక మిగతా ప్రపంచం మరిచిపోయేదాన్ని. నా మనసంతా పసిడిపైనే నిలిపా. కానీ కాంస్యం దక్కింది. అయినా ఒలింపిక్స్‌ పతకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచినందుకు గర్వంగా ఉంది. భారత పతాకం రెపరెపలాడుతుంటే ఆనందంతో పొంగిపోయా" అని ఆ రోజును గుర్తుచేసుకున్నారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగానికి మారడం గురించి మాట్లాడుతూ.. "12 ఏళ్ల వయసులోనే వెయిట్‌లిఫ్టింగ్‌ మొదలెట్టా. వయసుతో పాటు బరువు కూడా పెరగడం వల్ల పోటీపడే విభాగం మారాల్సి వచ్చింది. పోటీల కోసం బరువు తగ్గడం శరీరానికి మంచిది కాదని అప్పటి కోచ్‌లు చెప్పడమే దానికి కారణం. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల ప్రత్యేక ఆహార నియమాలు అంటూ ఏమీ ఉండేవి కావు. జాతీయ శిబిరాల్లో అయితే ప్రత్యేక భోజనం ఉండేది. కానీ మళ్లీ ఇంటికి వచ్చాక మజ్జిగలో అంబలి కలిపి తాగేదాన్ని. రాగి సంగటి తినేదాన్ని. మా అమ్మ చాలా ప్రోత్సహించేది. ఆడపిల్లకు బరువులెత్తే ఆటలెందుకని బంధువులు చెప్పినా ఆమె వినలేదు" అని కరణం మల్లీశ్వరి చెప్పారు.

ఏమీ మారలేదు

వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుల కోసం వసతుల ఏర్పాటు విషయంలో ఏమీ మారలేదని, 30 ఏళ్ల క్రితం తాను పోటీపడే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని మల్లీశ్వరి పేర్కొంది.

"ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులకు కల్పించే వసతులు, సౌకర్యాల పరంగా చూస్తే ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ 20 ఏళ్లలో మరో మల్లీశ్వరి రాలేదు. 30 ఏళ్ల క్రితం మేం మట్టిలోనే సాధన చేసేవాళ్లం. అకాడమీ ఏర్పాటు నేపథ్యంలో ప్రతిభావంతులైన వెయిట్‌లిఫ్టర్ల కోసం మూడేళ్ల క్రితం ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని గ్రామాల్లోకి వెళ్లే ఇప్పటికీ అక్కడ మట్టిలోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అది చూసి చాలా బాధ కలిగింది. అందుకే ప్రపంచ స్థాయి వసతులు, సౌకర్యాలతో కూడిన అకాడమీ నిర్మించాలని అనుకున్నా. ప్రస్తుతం ఏపీలో దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 300 మంది పిల్లలకు అక్కడ శిక్షణ అందిస్తాం. వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకునే వాళ్లకు మల్లీశ్వరి అకాడమీ చిరునామాగా మారాలి."

"తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తే హైదరాబాద్‌లోనూ అకాడమీ ఏర్పాటు చేస్తా. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన వెయిట్‌లిఫ్టర్లకు కొదవలేదు. వాళ్లకు సరైన వసతులు కల్పించి, ప్రోత్సాహం అందిస్తే ఛాంపియన్లుగా మారగలరు. హరియాణాలోని అకాడమీలో కొందరు శిక్షణ పొందుతున్నారు. 2028 ఒలింపిక్స్‌లో నా అకాడమీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు సాధించేలా చూడడమే నా లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారుల వెనక స్పాన్సర్లు పడుతుంటారు. ఆ పద్ధతి మారాలి. నైపుణ్యాలున్న వారికి మొదటి నుంచే అండగా నిలవాలి. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అథ్లెట్లకు మంచి మద్దతు ఉంది. నేను 1995లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గెలిచినపుడు పత్రికలో ఓ మూలన చిన్న ఫోటో వచ్చింది. కానీ అదే ఏడాది పుట్టిన పీవీ సింధు నిరుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే ఆమెకు ఎంతో ప్రాచుర్యం దక్కింది. అది చాలా మంచి విషయం" అని ఆమె వెల్లడించారు.

హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు కోసం ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేలా చూస్తామని ఈ వెబినార్‌లో పాల్గొన్న శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details