వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్ క్రీడాకారులు కదలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న 35 జాతీయ క్రీడా పురస్కారాలను తిరిగి ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు సోమవారం వెళ్లారు. ఆ రాష్ట్రం నుంచి రెండుసార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మాజీ రెజ్లర్ కర్తార్ సింగ్.. ఈ బృందానికి నేతృత్వం వహించారు.
"రైతులు ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచారు. మా రైతు సోదరులపై లాఠీఛార్జ్ చేయడం, వాళ్లు రాకుండా రోడ్లు మూసేయడం లాంటి ప్రభుత్వ ప్రయత్నాలను చూశాం. తమ హక్కుల కోసం రైతులు చలిగాలులను లెక్క చేయకుండా కూర్చుకున్నారు. నేనూ రైతు కొడుకునే. ఐజీ, పోలీసు అయినప్పటికీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను. ఈ క్రూరమైన చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నాను. కరోనా భయంతో దేశం మొత్తం వణికిపోతున్న సమయంలో బిల్లును ఆమోదించారు. కొత్త చట్టంపై ప్రజలు సంతోషంగా లేనప్పుడు.. ఈ వివాదాస్పద చట్టాన్ని అంగీకరించడానికి రైతులపై ప్రభుత్వం ఎందుకు బలవంతం చేస్తోంది?"
- కర్తార్ సింగ్, భారత మాజీ క్రీడాకారుడు
కర్తార్ సింగ్.. 1982లో అర్జున అవార్డు, 1987లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఒలింపిక్ స్వర్ణ విజేత మాజీ హాకీ క్రీడాకారిణి గుర్మైల్ సింగ్, మాజీ మహిళా హాకీ కెప్టెన్ రాజ్బీర్ కౌర్ తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. 2014లో ధ్యాన్చంద్ అవార్డును గుర్మైల్ సొంతం చేసుకోగా.. 1984లో అర్జున పురస్కారానికి రాజ్బీర్ ఎంపికయ్యారు.
ఆదివారమే దిల్లీ చేరుకున్న క్రీడాకారులు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రగా సాగారు. సమీపంలోని కృష్ణ భవన్ వద్ద ఉన్న పోలీసులు, కర్తార్ సింగ్ బృందాన్ని వెనక్కి పంపారు.