తెలంగాణ

telangana

ETV Bharat / sports

8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. మనోళ్లు అదరగొడతారా?

కామన్వెల్త్‌ క్రీడలు మరో ఎనిమిది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ సారి పోటీల్లో కొన్ని కొత్త ఆటలు చేరిన నేపథ్యంలో భారత్​కు కూడా ప్రాతినిథ్యం పెరిగింది. దీంతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటి పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆటగాళ్లు.

By

Published : Jul 20, 2022, 6:38 AM IST

Commonwealth Games
8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. మనోళ్లు అదరగొడతారా?

కామన్వెల్త్‌ క్రీడలకు సమయం దగ్గర పడుతోంది. ఇంకో ఎనిమిది రోజుల్లోనే ఆటలు మొదలవుతున్నాయి. ఈసారి క్రీడల్లో షూటింగ్‌ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ కొత్తగా వేరే ఆటలు కామన్వెల్త్‌లో భాగం కాబోతున్నాయి. అందులో బాస్కెట్‌బాల్‌ 3×3, వీల్‌ ఛైర్‌ బాస్కెట్‌బాల్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌లతో పాటు మహిళల క్రికెట్‌ కూడా ఉండడం విశేషం. గతంలో కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల క్రికెట్‌ పోటీలు జరిగాయి కానీ.. మహిళల క్రికెట్‌ ఇందులో భాగం కావడం ఇదే తొలిసారి. ఈ నెల 28న మొదలయ్యే కామన్వెల్త్‌ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్‌ చూడబోతున్నాం. టోర్నీకి ఎనిమిది జట్లు ఎంపిక కాగా.. భారత మహిళల జట్టు పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌లతో కలిసి గ్రూప్‌-ఎలో ఉంది. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. ఇదే జోరు కొనసాగిస్తే కామన్వెల్త్‌ క్రికెట్లో పతకం గెలవడం కష్టమేమీ కాదు. పసిడి రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురు కావచ్చు. 29న ఆస్ట్రేలియాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఆగస్టు 7న ఫైనల్‌ జరుగుతుంది.

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం..:భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఎక్కడ, ఏ ఆటలో తలపడ్డా క్రీడాభిమానుల్లో ఉండే ఆసక్తే వేరు. కామన్వెల్త్‌ క్రీడలకు కూడా వీటి పోరే ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. తొలిసారి మహిళల క్రికెట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో అరంగేట్రం చేస్తుండగా.. భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉండడంతో లీగ్‌ దశలోనే చిరకాల ప్రత్యర్థుల పోరు చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఈ నెల 31న జరగనున్న ఈ మ్యాచ్‌ పట్ల స్థానిక అభిమానుల్లో అమితాసక్తి నెలకొందని, దీని కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొంటున్నారని బర్మింగ్‌హామ్‌ క్రీడల నిర్వాహకులు వెల్లడించారు. మొత్తంగా కామన్వెల్త్‌ క్రీడలు చూసేందుకు ఇప్పటిదాకా 12 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు.

పతకం సాధిస్తా... జ్యోతి:కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధిస్తానని భారత అథ్లెట్‌ జ్యోతి యర్రాజి విశ్వాసం వ్యక్తంజేసింది. ఇటీవల ఐరోపా పర్యటనలో 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి మూడు సార్లు జాతీయ రికార్డు నమోదు చేసింది. ‘‘కామన్వెల్త్‌ క్రీడలంటే కాస్త ఒత్తిడి.. అదే సమయంలో ఉత్సాహంగా ఉంది. ఐరోపా పర్యటన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. 13 సెకన్ల టైమింగ్‌ నమోదు చేస్తే కామన్వెల్త్‌ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసినట్లే. ఈ క్రీడల్లో పతకం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నాది అతి విశ్వాసం కాదు. ఇప్పుడా నా దృష్టంతా లక్ష్యంపైనే’’ అని చెప్పింది. ఇంత త్వరగా కామన్వెల్త్‌ క్రీడల లాంటి పెద్ద టోర్నీకి అర్హత సాధిస్తానని ఊహించలేదని జ్యోతి పేర్కొంది. ‘‘కాస్త ఆలస్యంగా 17 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌ మొదలుపెట్టా. కోచ్‌ రమేశ్‌ సర్‌ నన్ను హర్డిల్స్‌కు మార్చారు. ఆయన నాకెప్పుడూ అండగా నిలిచారు. ఇంత త్వరగా కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని అనుకోలేదు. అదృష్టవశాత్తు అన్నీ కలిసొచ్చాయి. నాకు మద్దతుగా నిలిచిన నాన్నకు కృతజ్ఞతలు’’ అని 22 ఏళ్ల జ్యోతి తెలిపింది.

ఇదీ చదవండి:అభిమానులకు షాక్​ ఇచ్చిన ప్రముఖ సింగర్​.. అవన్నీ 'డిలీట్'​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details