తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2023, 11:54 AM IST

Updated : Apr 24, 2023, 1:27 PM IST

ETV Bharat / sports

Wrestlers Protest: రూట్‌ మార్చిన రెజ్లర్లు!.. రాజకీయ పార్టీల మద్దతు కావాలంటూ..

భారత స్టార్ రెజ్లర్లు రూట్​ మార్చారు! గతంలో తమతో కలిసి నిరసనలో పాల్గొనేందుకు రాజకీయ నాయకులను అనుమతించని వీరు.. ఇప్పుడు రాజకీయ పార్టీల మద్దతు కోరుతుండటం గమనార్హం.

wrestlers protest
wrestlers protest

దేశ రాజధాని దిల్లీలో రెజ్లింగ్‌ క్రీడాకారులు మళ్లీ రోడ్డెక్కారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాల్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ వరుసగా రెండో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు ఆదివారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న క్రీడాకారులు.. సోమవారం ఉదయం కూడా నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు తమ ఆందోళన విరమించబోమని చెబుతున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వినేశ్​ ఫొగాట్​తో పాటు మరో ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రెజ్లర్ల నిరసన

అప్పుడు రాజకీయ పార్టీలను వద్దని.. ఇప్పుడేమో..
అయితేేెబ్రిజ్‌భూషణ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పలు రాజకీయ పార్టీలు వీరికి మద్దతు పలుకుతూ దీక్షలో కూర్చోవాలని ప్రయత్నించారు. అందుకు క్రీడాకారులు తిరస్కరించారు. అయితే ఈసారి తాము అలా చేయబోమని బజరంగ్‌ పునియా తెలిపాడు. తమ ఆందోళన మద్దతిచ్చేవారు ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని చెప్పాడు.

"ఈసారి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. భాజపా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ.. ఏ పార్టీ అయినా సరే మాకు మద్దతిచ్చి దీక్షలో కూర్చోవచ్చు. అయితే, మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు" అని పునియా వివరించాడు. "గతంలో నిరసన చేపట్టినప్పుడు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఈసారి మేం ఎవర్నీ గుడ్డిగా నమ్మబోం. కేసు నమోదు చేసేంత వరకు దీక్ష కొనసాగుతుంది" అని వినేశ్‌ ఫొగాట్‌ తెలిపింది.

దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు..
బ్రిజ్‌ భూషణ్‌పై ఓ మైనర్‌ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోలేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, రెజ్లర్ల ఆరోపణలపై దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల పర్యవేక్షక కమిటీ ఏప్రిల్‌ తొలి వారంలో దర్యాప్తు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. దీంతో వీరంతా మళ్లీ నిరసన బాటపట్టారు. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. రెజ్లర్లు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడాశాఖ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి దర్యాప్తు నివేదిక కోరినట్లు పేర్కొన్నారు.

Last Updated : Apr 24, 2023, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details