కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సామాన్య ప్రజలు, ప్రముఖులు, క్రీడాకారులు టీకా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు దేశంలో 148 మంది అథ్లెట్లు (అన్ని క్రీడలతో కలిపి) వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేందర్ బత్రా. ఇందులో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
"మొత్తం 148 మంది అథ్లెట్లలో 17 మంది టీకా రెండు డోసులు వేసుకోగా, మరో 131 మంది తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులూ ఉన్నారు. అలాగే 13 మంది పారా ఒలింపిక్స్ అథ్లెట్లు కూడా తొలి విడత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో ఇద్దరు రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో కలిపి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్న అథెట్ల సంఖ్య 163. ఇందులో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోయే ఆటగాళ్లలో 87 మంది తొలివిడత డోసులు వేసుకోగా, 23 మంది రెండు డోసులు వేసుకున్నారు."