Yashasvi Jaiswal Ind Vs WI : అతి పిన్నవయసులో భారత టెస్టు జట్టులో అవకాశం దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది విదేశీ గడ్డపై అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ బాదటం అంటే.. ఇక ఆ వ్యక్తి ఘనత చెప్పుకోవాల్సిందే. 21 ఏళ్లకే యశస్వి.. వెస్టిండీస్ టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే తనదైన శైలిలో విజృంభించి.. జట్టుకు 171 పరుగులను అందించాడు. శతకంతో చెలరేగిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన యశస్వి.. టీమ్ఇండియా దాకా రావడం వెనుక మామూలు కష్టం లేదు.
సెంచరీల సారథి.. రంగంలోకి దిగితే పరుగుల ప్రవాహమే! - ఇండియా వర్సెస్ వెస్టిండీస్ స్కోర్
Yashasvi Jaiswal Records :మూడేళ్ల ముందు అండర్-19 ప్రపంచకప్లో బరిలోకి దిగి అదరగొట్టాడు. ఆపై రంజీ ట్రోఫీ వైపునకు అడుగులేశాడు. అక్కడా పరుగుల వరద పారించాడు. ఇక ఐపీఎల్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ సీజన్లోనూ సెంచరీ కూడా కొట్టాడు. ఇరానీ, దులీప్ ట్రోఫీలో ఆడిస్తే అక్కడ కూడా పరుగుల మోతే. ఫస్ట్క్లాస్ అయినా, లిస్ట్-ఏ అయినా, టీ20లైనా.. ఫార్మాట్తో సంబంధం లేదు. తన అడుగే ఒక ప్రభంజనం అన్నట్లు పరుగులే పరుగులు.. సెంచరీలే సెంచరీలు! ఇవన్నీ ఒకెత్తు అయితే .. విదేశీ గడ్డపై టెస్టుల్లో సత్తా చాటడం మరో ఎత్తు. అతడి గురించే ఈ కథనం..
Yashasvi Jaiswal records
క్రికెట్ మీద మక్కువతో తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ముంబయికి పయనమైన ఈ చిన్నోడు .. ఈ స్టేజ్కు చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. రోజంతా మైదానంలో ప్రొఫెషనల్ క్రికెటర్లకు సాయపడుతూ.. అవకాశం వచ్చినప్పుడు సాధన చేయడం.. రాత్రి సమీపంలోని ఒక గుడారంలో తలదాచుకోవడం.. ఇలా అతడి ప్రయాణం ఎన్నో ఆటుపోట్లతో సాగింది. తన ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించిన ఓ కోచ్ .. అతడు రాటుదేలేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత అతడి జర్నీ ఎలా సాగిందంటే..
- Yashasvi Jaiswal Records: వివిధ వయసు విభాగాల్లో ముంబయి తరఫున సత్తా చాటిన జైస్వాల్..అండర్-19 ప్రపంచకప్లో తలపడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో యశస్వి కెరీర్ ఓ మలుపుకు తిరిగింది.
- ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన టాలెంట్ హంట్ శిబిరంలో కేవలం యశస్వి ఆడిన ఒకే ఒక్క షాట్ చూసి రాయల్స్ హై పెర్ఫామెన్స్ డైరెక్టర్ జుబిన్ భరూచా అబ్బురపడి తనను జట్టులోకి ఎంచుకున్నాడు.
- ఇరాని కప్, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారె.. ఇలా ఆడిన ప్రతి దేశవాళీ టోర్నీలోనూ అతడి ఖాతాలో ఓ సెంచరీ ఉంది.
- 18 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ యంగ్ ప్లేయర్.. అందులోనూ నిలకడగా రాణించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జైస్వాల్.. 14 మ్యాచ్ల్లో ఏకంగా 625 పరుగులు రాబట్టాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది.
- ఐపీఎల్లో జైస్వాల్ దూకుడు చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తన స్ట్రైక్ రేట్ 160కి పైనే కావడం విశేషం. ఒక మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్న ఈ ప్లేయర్.. పలు సందర్భాలలో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
- ఇక ఈ విధ్వంసక బ్యాటర్ తన అరంగేట్ర టెస్టులో చూపించిన సంయమనం ఆశ్చర్యం కలిగించేదే. 13 బంతులకు కానీ తొలి పరుగు తీయని జైస్వాల్.. సెంచరీకి మాత్రం 215 బంతులు తీసుకున్నాడు. తన శతకంలో 47 పరుగులన్నీ సింగిల్స్, డబుల్స్ ద్వారా వచ్చినవే.
- అరంగేట్ర టెస్టులో అత్యధిక బంతులు (387) ఆడిన భారత బ్యాటర్గా జైస్వాల్ రికార్డు సృష్టించడం విశేషం.