తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2021, 6:35 AM IST

ETV Bharat / sports

ఓపెనర్లు మెరిసినా.. ఇబ్బందుల్లో భారత్

ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరుగుతోన్న ఏకైక టెస్టులో ఇబ్బందుల్లో పడింది భారత జట్టు. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మంధాన మెరిసినా.. మిగతావారు విఫలమవడం వల్ల రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది మిథాలీసేన.

Women's Test:
భారత్ ఇంగ్లాండ్

ఓపెనర్లు షెఫాలీ వర్మ (96; 152 బంతుల్లో 13×4, 2×6), స్మృతి మంధాన (78; 155 బంతుల్లో 14×4) రాణించడం వల్ల ఇంగ్లాండ్‌ మహిళలతో ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో భారత్‌ పటిష్ఠంగా కనిపించింది. కానీ అనూహ్యంగా తడబడిన భారత్‌.. రెండోరోజు ఆట చివరికి 187/5తో కష్టాల్లో పడిపోయింది. మిథాలీ సేన 16 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది.

షెఫాలి తొలి వికెట్‌గా వెనుదిరిగిన వెంటనే మంధాన కూడా పెవిలియన్‌ చేరగా.. పూనమ్‌ రౌత్‌ (2), శిఖా పాండే (0), కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. హర్మన్‌ప్రీత్‌ (4), దీప్తిశర్మ (0) క్రీజులో ఉన్నారు. భారత్‌ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 269/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను సోఫియా డంక్లీ (74 నాటౌట్‌), ష్రబ్‌సోల్‌ (47) మెరుగైన స్థితికి చేర్చారు. షబ్ర్‌సోల్‌ ఔట్‌ కాగానే.. ఇంగ్లాండ్‌ 396/9 వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బౌలర్లలో స్నేహ రాణా (4/131), దీప్తిశర్మ (3/65) రాణించారు.

రికార్డులు

తొలి ఇన్నింగ్స్​లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ రికార్డు సృష్టించారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి వికెట్​కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా నిలిచారు. వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 167 పరుగులు. ఇంతకుముందు జార్గీ బెనర్జీ, సంధ్య అగర్వాల్ పేరిట ఈ రికార్డు (153) ఉండేది.

17 ఏళ్ల షెఫాలీ వర్మ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు(96) చేసిన భారత మహిళా క్రికెటర్​గా నిలిచింది. 1995లో న్యూజిలాండ్​పై చందర్​కాంత కౌల్ చేసిన 75 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

ఇవీ చూడండి: WTC FINAL: తొలి ఛాంపియన్​షిప్​ వరించేదెవరిని?

ABOUT THE AUTHOR

...view details