ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు.. వివిధ కారణాలతో వెస్డిండీస్, బంగ్లాదేశ్తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమయ్యారు. దీంతో జూనియర్లతోనే కంగారూ జట్టు ఈ పర్యటనకు వెళ్లనుంది. ఆటగాళ్లు తప్పుకోవడానికి గల కారణాలు వెల్లడించకపోయినా.. బయోబబుల్లో ఉండటం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
విండీస్, బంగ్లాతో సిరీస్ నుంచి స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, మ్యాక్స్వెల్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, స్టోయినిస్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్ వైదొలిగారు. ఇందులో స్మిత్ మోచేతి గాయం కారణంగా తప్పుకోగా, మిగతా వారు బోర్డుకు తమను ఈ పర్యటనకు దూరంగా ఉంచమని బోర్డును కోరినట్లు సమాచారం.
ఈ పర్యటన నుంచి తప్పుకొన్న ఆసీస్ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్లో ఆడుతున్న వాళ్లే. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడటం వల్ల గత నెలలో స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత సిడ్నీలో మళ్లీ క్వారంటైన్లో ఉన్నారు. దీంతో వీరికి కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ టూర్ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.