Virat Kohli Yo Yo Test : మరికొద్దిరోజుల్లో ప్రారంభమవ్వనున్న ఆసియా కప్ కోసం టీమ్ఇండియా సన్నద్ధమవ్వుతోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా అలూరులో నిర్వహించిన యో-యో టెస్టును కూడా విరాట్ క్లియర్ చేశాడు. ఈ క్రమంలో యో-యో టెస్టులో పాసయ్యానని, 17.2 స్కోర్ సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లీ వెల్లడించాడు. దీంతో విరాట్ ఫుల్ స్ట్రాంగ్ అంటూ అభిమానులు పోస్టులు పెట్టారు.
బీసీసీఐ సీరియస్!
BCCI On Virat : అయితే విరాట్ పెట్టిన పోస్ట్ను బీసీసీఐ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కోహ్లీ యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్ను పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోసారి ఇలా అలా చేయొద్దంటూ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"టీమ్ఇండియా జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ఆటగాళ్లను హెచ్చరించాం. వారు తమ ట్రైనింగ్ సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. కానీ వారి స్కోర్లను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదు. అది వారి కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్దం" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.