తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2022, 6:54 AM IST

Updated : Jan 14, 2022, 11:40 AM IST

ETV Bharat / sports

అండర్‌-19 ప్రపంచకప్‌ వేళాయే.. ఫేవరెట్‌గా యువ భారత్‌

Under 19 World Cup 2022: దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. బ్యాటర్‌గా, సారథిగా సత్తాచాటుతున్న విరాట్‌ కోహ్లీ.. బంతితో, బ్యాట్‌తో రాణిస్తున్న రవీంద్ర జడేజా.. జట్టులో సుస్థిర స్థానం కోసం తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న పృథ్వీ షా.. శుభ్‌మన్‌ గిల్‌! వీళ్లందరూ అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తాచాటి భారత సీనియర్‌ జట్టులో ఆడే స్థాయికి చేరుకున్నవాళ్లే! కుర్రాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చి.. ప్రపంచానికి పరిచయం చేసే ఈ యువ కప్పు మరోసారి వచ్చేసింది. శుక్రవారం నుంచే సమరానికి తెరలేవనుంది. మరి ఈ సారి తమ అద్భుత నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించేదెవరో?

UNDER19 WORLD CUP
అండర్‌-19 ప్రపంచకప్‌

Under 19 World Cup 2022: కుర్రాళ్ల ప్రపంచకప్‌ మళ్లీ వచ్చేసింది. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌లో యువ జట్ల సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి 5న విజేత ఎవరో తేలిపోతుంది. కరీబియన్‌ దీవుల్లో తొలిసారి జరుగుతున్న ఈ అండర్‌-19 ప్రపంచకప్‌లో 16 జట్లు టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. రౌండ్‌ రాబిన్‌, నాకౌట్‌ ఫార్మాట్లో టోర్నీ సాగుతుంది.

  • గ్రూప్‌-ఏ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌తో పాటు కెనడా, ఇంగ్లాండ్‌, యూఏఈ ఉన్నాయి. గ్రూప్‌- బిలో భారత్‌, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, ఉగాండా..
  • గ్రూప్‌- సిలో జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌, పపువా న్యూ గునియా, పాకిస్థాన్‌.. గ్రూప్‌- డిలో స్కాట్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి.
  • ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌ చేరతాయి. కొవిడ్‌ నేపథ్యంలో తమ దేశంలో మైనర్లకు కఠిన ఆంక్షలు విధిస్తుండడంతో న్యూజిలాండ్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. వీసా ప్రక్రియ కారణంగా అఫ్గానిస్థాన్‌ ఆలస్యంగా చేరుకోవడంతో గ్రూప్‌- సి మ్యాచ్‌ల్లో మార్పులు చేశారు. టోర్నీ తొలి రోజు ఆతిథ్య వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా, శ్రీలంకతో స్కాట్లాండ్‌ పోటీపడతాయి. ఈ ప్రపంచకప్‌ కోసం రూపొందించిన బబుల్‌ పటిష్ఠంగానే ఉన్నప్పటికీ జింబాబ్వే, పాకిస్థాన్‌ జట్లకు వైరస్‌ సెగ తగిలింది.

తొలిసారి కప్‌ సాధించిన వేళ..

అప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే అండర్ -19 ప్రపంచకప్‌ పోటీలు జరిగాయి. మొదటిసారి ఆరో స్థానం, రెండో వరల్డ్‌కప్‌లో రెండో రౌండ్‌లోనే భారత్‌ ఇంటిముఖం పట్టింది. మూడోసారి (2000) మాత్రం అతిథ్యమిచ్చిన శ్రీలంకను ఫైనల్‌లో మట్టికరిపించి కప్‌ను సొంతం చేసుకొంది. ఈ జట్టుకు మహమ్మద్ కైఫ్ సారథిగా వ్యవహరించాడు.

కైఫ్‌తో సహా యువరాజ్‌ సింగ్‌, వేణుగోపాల్‌రావు జాతీయ జట్టుకు ఎంపిక కావడం విశేషం. అయితే కైఫ్‌, యువీ మాత్రమే విజయవంతంగా కెరీర్‌లో రాణించగా.. తెలుగు క్రికెటర్‌ వేణుగోపాల్‌ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీస్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయాడు.

మళ్లీ విరాట్ సారథ్యంలో..

మొదటి కప్‌ను అందుకున్న తర్వాత రెండో టైటిల్‌ను గెలుచుకునేందుకు భారత్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. ఆ మధ్యలో మూడుసార్లు జరిగితే రెండు మార్లు సెమీస్‌లో ఓటమి చవిచూడగా.. ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2008లో అండర్‌ -19 ప్రపంచకప్‌ను సారథిగా విరాట్ కోహ్లీ సాధించి పెట్టిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ జట్టుకు విరాట్ నాయకుడు కాగా.. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌ కావడం విశేషం. వీరిద్దరే కాకుండా మనీశ్‌ పాండే, సౌరభ్ తివారీ, అభినవ్ ముకుంద్, సిద్ధార్థ్‌ కౌల్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జాతీయ జట్టు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ తరఫున మంచి ప్రదర్శనే ఇచ్చారు. ఇదే సిరీస్‌లో విదేశీ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, ట్రెంట్ బౌల్ట్‌, స్టీవ్‌ స్మిత్, మార్కస్‌ స్టొయినిస్‌, టిమ్‌ సౌథీ, తిసారా పెరీరా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచారు.

వెలుగులోకి మరో తెలుగు కుర్రాడు

2012లో టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికైన సారథి ఉన్ముక్త్‌ చంద్ జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. ఐపీఎల్‌లోనూ తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. దీంతో గతేడాది భారత్‌లో క్రికెట్‌ ఆడటం లేదని, ఇక్కడి క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు కఠిన నిర్ణయం ప్రకటించాడు. ఇదే జట్టులోని తెలుగు కుర్రాడు హనుమ విహారి జాతీయ టెస్టు జట్టులో అడపాదడపా స్థానం సంపాదించగలుగుతున్నాడు. కానీ.. మిగతా ఫార్మాట్లలో అవకాశాలను అందుకోలేకపోతున్నాడు.

అందుకునేనా?

ఇటీవల ఆసియా అండర్‌-19 కప్‌ గెలిచి జోరు మీదున్న యువ భారత్‌ ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా అడుగుపెడుతోంది. టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన భారత్‌.. శనివారం దక్షిణాఫ్రికాతో పోరుతో టైటిల్‌ వేట మొదలెడుతుంది. ఆ తర్వాత 19న ఐర్లాండ్‌తో, 22న ఉగాండాతో తలపడుతుంది. భారత జట్టులో హర్నూర్‌ సింగ్‌, తెలుగు కుర్రాడు షేక్‌ రషీద్‌, కెప్టెన్‌ యశ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు.

మళ్లీ ఆరేళ్లకు కప్‌..

మరో ఆరేళ్లకు భారత్‌ జట్టు అండర్‌-19 ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. మధ్యలో 2014లో ఐదో స్థానంలో నిలిచింది. 2016లో టైటిల్‌ సాధించే అవకాశం వచ్చినా మిస్‌ చేసుకుంది. కప్‌ సాధించకపోయినా.. ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, ఖలీల్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి ఆటగాళ్లు సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యారు.

అయితే, 2018లో పృథ్వీషా నాయకత్వంలోని టీమ్‌ఇండియా యువ జట్టు టైటిల్‌ను తీసుకొచ్చింది. ఈ టీమ్‌ నుంచి పృథ్వీతోపాటు శుభ్‌మన్‌ గిల్, శివమ్‌ మావి, రియాన్‌ పరాగ్, అనుకుల్‌ రాయ్‌, అభిషేక్‌ శర్మ, హర్షదీప్‌ సింగ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. గిల్‌, పృథ్వీ షా సీనియర్‌ జట్టుకు ఎంపికవ్వగా.. మిగతా వారు ఐపీఎల్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు.

పోయినసారి మిస్‌.. మరి ఈసారైనా

2020లో ప్రియమ్‌ గార్గ్‌, రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్ల జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. కాస్తలో కప్‌ను చేజార్చుకుంది. మరి ఈసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియా టైటిల్‌ను సాధించుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నాడు.

భారత్‌ జట్టుకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఇటీవల జరిగిన ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడం. అదే ఊపును విండీస్‌ వేదికగా జరిగే అండర్-19 ప్రపంచకప్‌లోనూ ప్రదర్శించి విజయం సాధించాలి. గ్రూప్‌ స్థాయిలో దక్షిణాఫ్రికా (జనవరి 15), ఐర్లాండ్‌ (జనవరి 19), ఉగాండా (జనవరి 22) జట్లతో పోటీ పడనుంది.

ఇదీ చూడండి:'అలా అనిపిస్తే మెగా వేలంలో పాల్గొనడం కష్టమే'

Last Updated : Jan 14, 2022, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details