ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఉన్నట్టుండి విండీస్ ప్లేయర్లు మైదానంలోనే పడిపోయారు. పాక్ బ్యాటింగ్ సందర్భంగా ఫీల్డింగ్లో ఉన్న విండీస్ ప్లేయర్లు పది నిమిషాల వ్యవధిలో మైదానంలో కుప్పకూలారు. వెంటనే స్పందించిన మ్యాచ్ నిర్వాహకులు వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
"చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్.. అనే ఇద్దరు మహిళా క్రికెటర్లను వైద్య సాయం కోసం ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది" అని ఓ క్రీడా ఛానల్ తెలిపింది. అయితే వారు పడిపోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాక్.. ఆరు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 18 ఓవర్లలో 111 పరుగులుగా నిర్దేశించారు నిర్వాహకులు. ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ విజయాన్ని అందుకొంది.
వాళ్లు త్వరగా కోలుకోవాలి..
స్పృహ తప్పి పడిపోయిన ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ జవేరియా ఖాన్ ఆకాంక్షించింది. వారిద్దరూ జులై 4న జరిగే మూడో టీ20 నాటికి అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరిగిన తర్వాత కూడా మూడో టీ20 నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న వెస్టిండీస్ క్రికెట్ను ప్రశంసించింది జవేరియా. యూరో కప్ సందర్భంగా నెల మైదానంలో పడిపోయిన డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ను జవేరియా గుర్తు చేసుకుంది.