మీరాబాయి చాను 109 కిలోల బరువు విజయవంతంగా ఎత్తినప్పుడు హాల్ చప్పట్లతో మార్మోగింది. చాను కాస్త వెనక్కి జరిగి ఎప్పటిలాగే నవ్వుతూ 'నమస్తే' చెప్పింది. ఆపై ఆమె కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించడమే కాకుండా.. కొత్త రికార్డు నెలకొల్పినప్పుడు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అంతకుముందే సంకేత్ సాగర్ రజతం, గురురాజ కాంస్యాలు గెలిచి భారత్ ఖాతా తెరిచారు. పదకొండు రోజుల పాటు మొత్తం దేశమంతా ఊపిరిబిగబట్టి క్రీడలను అనుసరించింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు సహా మొత్తం 61 పతకాలతో కామన్వెల్త్లో తన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి అనదగ్గ ప్రదర్శనతో క్రీడలను ముగించింది. అది కూడా క్రీడల్లో తనకు బాగా కలిసొచ్చే షూటింగ్ లేకుండానే. గెలుపు సంబరాలు చేసుకోవడానికి.. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత్ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నెల కంటే మంచి సమయమేముంటుంది.
విజేతలైన అథ్లెట్లంతా పట్టుదలతో తీవ్ర ప్రతికూలతలను అధిగమించినవారే. మహిళా బృందానికి ఎదురైన సవాళ్లు మరింత కఠినమై ఉండొచ్చు. వాళ్లు పోటీదారులు నెలకొల్పిన ప్రమాణాలనే కాదు... సమాజం, కుటుంబం, ఇతర బాహ్య అధికార వ్యవస్థల ప్రమాణాలనూ జయించారు. జూడోలో సుశీలా దేవి, తూలిక మాన్ రజతాల నుంచి రెజ్లింగ్లో సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ల స్వర్ణాల వరకు.. బాక్సింగ్లో నీతూ, నిఖత్ జరీన్ల స్వర్ణాల నుంచి బ్యాడ్మింటన్లో సింధు పసిడి వరకు ఈ ఏడాది మనం ఎన్నో అద్భుత ప్రదర్శనలను చూశాం. ఉత్కంఠ పోరులో గెలిచి మన మహిళల హాకీ జట్టు కూడా కాంస్యం సాధించింది. బాగా తెలిసిన ఆటల్లోనే కాకుండా.. కొత్త ఆట లాన్ బాల్స్లోనూ భారత్ మెరిసింది. అందులో మహిళల ఫోర్స్ జట్టు పసిడి పట్టేసింది. దేశానికి దాదాపుగా తెలియని ఆటలో పతకం, అదీ స్వర్ణం నెగ్గడం చాలా గొప్ప విషయం. ఆసక్తికర విషయమేంటంటే జట్టు సభ్యులైన రూప రాణి టిర్కీ, లవ్లీ చౌబే, పింకీ సింగ్, నయన్మొని సైకియాలవి చాలా భిన్న నేపథ్యాలు. రూప ఒకప్పుడు కబడ్డీ క్రీడాకారిణి, నయన్మొని వెయిట్లిఫ్టర్, పింకీ క్రికెటర్ కాగా.. లవ్లీ మొదట్లో స్ప్రింటర్. వాళ్లంతా చాలా తక్కువ మంది నడిచిన దారిని ఎంచుకుని గొప్ప కీర్తిని సంపాదించారు. అయితే క్రీడల్లో అమ్మాయిల కీర్తిలో గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిళితమై ఉన్నాయి. ఈ కీర్తి వారికి సాధికారతను కల్పిస్తుంది. దీనికి మూలం ఆటలే. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా అత్యుత్తమ స్థాయిని అందుకోవడంలో జాతి, లింగ భేదాలు లేకుండా క్రీడలు అందరినీ ఏకంగా చేస్తాయి. అయితే కొన్ని క్రీడల్లో కొన్ని ప్రపంచ ఈవెంట్లలో చాలా ఆలస్యంగా మహిళలకు పోటీపడే అవకాశాన్ని ఇచ్చారని మనం గుర్తించాలి. ఉదాహరణకు బాక్సింగ్నే తీసుకోండి. మేరీకోమ్, నిఖత్ జరీన్ లాంటి ఛాంపియన్లు మనకు ఆ క్రీడలో ఉన్నారు. కానీ మహిళల బాక్సింగ్ను తొలిసారి ఒలింపిక్స్లో 2012 (లండన్)లో చేర్చారు. ఈ సంవత్సరమే మహిళల క్రికెట్ కామన్వెల్త్ అరంగేట్రం చేసింది. అందులో మన జట్టు రజతం నెగ్గి మనం గర్వపడేలా చేసింది.