తెలంగాణ

telangana

By

Published : Oct 14, 2022, 6:51 AM IST

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​కు వేళాయే.. మరో రెండు రోజులే

బంతిని బౌండరీలు దాటించేందుకు క్రీజులో బ్యాటర్ల విన్యాసాలు.. వికెట్ల వేటలో బంతులతో మాయ చేసే బౌలర్లు.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్‌లను అందుకునే ఫీల్డర్లు.. వెరసి మరోసారి టీ20 ప్రపంచకప్‌ కిక్కును ఆస్వాదించే సమయం వచ్చేస్తోంది. 2021 పొట్టి ప్రపంచకప్‌ దృశ్యాలు ఇంకా తాజాగా ఉండగానే.. ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ఏడాది గడవకముందే.. మరో ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. పొట్టి కప్పు పోరుకు ఆదివారమే తెరలేవనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఆరంభానికి మిగిలింది మరో రెండు రోజులే.

T20 worldcup
టీ20 ప్రపంచకప్​కు వేళాయే

కంగారూ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి జట్ల మధ్య టైటిల్‌ కోసం హోరాహోరీ పోరుకు వేదికలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 16న 2022 టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. ఇప్పటికే ఈ పొట్టి కప్పు కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకోగా.. మిగతా దేశాలూ అదే పనిలో ఉన్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో ఇప్పటికే ప్రపంచకప్‌ సందడి మొదలైంది. ఇక సూపర్‌-12కు అర్హత సాధించేందుకు తొలి రౌండ్‌లో పోరాటాలు, కీలక పోరులో ప్రధాన జట్ల మధ్య ఆసక్తి రేకెత్తించే మ్యాచ్‌లు అభిమానుల కోసం ఎదురు చూస్తున్నాయి.

అసలుకు ముందు అర్హత..టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 సమరానికి ముందు తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా సూపర్‌-12కు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్‌- ఎ లో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, గ్రూప్‌- బి లో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12లో ఆడే ఛాన్స్‌ కొట్టేస్తాయి. ఆదివారం ఈ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 సమరం మొదలవుతుంది.

తొలి రౌండ్లో ఛాంపియన్లు.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ తొలిసారి అర్హత రౌండ్లో పోటీపడనుంది. మరోవైపు ఓ సారి కప్పు సొంతం చేసుకున్న శ్రీలంక వరుసగా రెండో సారి అర్హత రౌండ్లో ఆడాల్సి వచ్చింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌, రన్నరప్‌తో పాటు నవంబర్‌ 15 నాటికి టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా సూపర్‌-12కు అర్హత సాధించాయి. దీంతో వరుసగా 9, 10వ స్థానాల్లో నిలిచిన శ్రీలంక, వెస్టిండీస్‌ నేరుగా సూపర్‌-12కు చేరుకోలేకపోయాయి. వీటి కంటే మెరుగైన ర్యాంకింగ్స్‌తో అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సూపర్‌-12లో చోటు దక్కించుకున్నాయి. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా స్కాట్లాండ్‌, నమీబియా, గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, యూఏఈ, జింబాబ్వే తొలి రౌండ్‌ పోరుకు అర్హత సాధించాయి.

ఇప్పటివరకూ ఈ ప్రపంచకప్‌ను అత్యధికంగా రెండు సార్లు వెస్టిండీస్‌ (2012, 2016) సొంతం చేసుకుంది. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి కప్పును ముద్దాడాయి. ఇది ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌. 2007లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు.

ఇదీ చూడండి:మహిళల ఐపీఎల్​కు ముహూర్తం ఫిక్స్.. టీమ్​లు, ఫార్మాట్ వివరాలు ఇలా..

ABOUT THE AUTHOR

...view details