కంగారూ గడ్డపై టీ20 ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి జట్ల మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరుకు వేదికలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 16న 2022 టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుంది. ఇప్పటికే ఈ పొట్టి కప్పు కోసం టీమ్ఇండియా సహా కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకోగా.. మిగతా దేశాలూ అదే పనిలో ఉన్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్లతో ఇప్పటికే ప్రపంచకప్ సందడి మొదలైంది. ఇక సూపర్-12కు అర్హత సాధించేందుకు తొలి రౌండ్లో పోరాటాలు, కీలక పోరులో ప్రధాన జట్ల మధ్య ఆసక్తి రేకెత్తించే మ్యాచ్లు అభిమానుల కోసం ఎదురు చూస్తున్నాయి.
అసలుకు ముందు అర్హత..టీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరానికి ముందు తొలి రౌండ్ మ్యాచ్లు జరుగుతాయి. సూపర్-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా సూపర్-12కు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్- ఎ లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, గ్రూప్- బి లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12లో ఆడే ఛాన్స్ కొట్టేస్తాయి. ఆదివారం ఈ తొలి రౌండ్ మ్యాచ్లు ఆరంభమవుతాయి. ఈ నెల 22 నుంచి సూపర్-12 సమరం మొదలవుతుంది.