టీ20ల్లో సెంచరీ.. వన్డేల్లో డబుల్ సెంచరీ.. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ.. ఇప్పటి వరకు మనం చూసిన అద్భుతాలు. కానీ వన్డే క్రికెట్లో ఏకంగా 400 స్కోరు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడదే ఊహించని ఫీట్ నమోదైంది. వన్డేల్లో ఏకంగా 407 పరుగులు సాధించాడో కుర్రాడు. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. సిక్సర్ల సునామీతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 165 బంతుల్లోనే ఏకంగా 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి.. వన్డే మ్యాచ్లో అద్భుతం సృష్టించాడు.
కర్ణాటకలో జరిగిన అంతర్ జిల్లా పోటీల్లో ఈ మహా విధ్వంస చోటు చేసుకుంది. ఆదివారం సాగర్ క్రికెట్ క్లబ్-భద్రావతి ఎన్టీసీసీ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో తన్మయ్ మంజునాథ్ అనే అండర్-16 క్రికెటర్ ఈ చరిత్ర సృష్టించాడు. సాగర్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. భద్రావతి బౌలర్లను బెంబేలెత్తించాడు. బంతిని బాదితే ఫోర్ లేదా సిక్స్ అంటూ ఎవరూ ఊహించలేని రికార్డును నమోదు చేశాడు. కాగా, మంజునాథ్ కర్ణాటకలోని శిమమొగ్గా ప్రాంతానికి చెందిన వాడు. సాగర్ క్రికెట్ క్లబ్ తరఫున అండర్ 16 పోటీల్లో పాల్గొన్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్తో మంజునాథ్ పేరు సంచలనంగా మారింది.