Rewind 2021 Sports: కోట్లాది హృదయాలు గర్వంతో ఉప్పొంగిన క్షణాలు! ఆవేదనతో తడిసిన క్రికెట్ ప్రేమికుల మనసులు! కన్నీళ్లు పెట్టించిన ఓటములు.. తలెత్తుకునేలా చేసిన విజయాలు! నింగికి ఎగిసిన దిగ్గజాలు.. ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శనలు! ఆందోళన కలిగించిన వివాదాలు.. ఆనందంలో ముంచిన సంచలనాలు! ఇలా ఈ ఏడాదిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు. పదిలంగా పది కాలల పాటు దాచుకునేవి కొన్ని.. ముందుకు సాగేందుకు మరిచిపోయేవి మరికొన్ని! కాలగర్భంలో కలిసిపోతున్న 2021లో క్రీడల్లో కొన్ని ముఖ్య పరిణామాలను ఓసారి నెమరు వేసుకుందాం!
అద్భుతం
Neeraj Chopra Record: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ 2021లో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. ఈ క్రీడలు ముగింపు దిశగా సాగుతున్న సమయమది.. అప్పటికే భారత అథ్లెట్లు మంచి ప్రదర్శనే చేశారు కానీ పసిడి మాత్రం దక్కలేదు. ఇక మిగిలింది అథ్లెటిక్స్ మాత్రమే కావడం వల్ల మరోసారి స్వర్ణం లేకుండానే మన అథ్లెట్లు తిరిగి వస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అంచనాలు లేని అథ్లెటిక్స్లో అది కూడా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అద్భుతమే చేశాడు. ఈటెను ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం పట్టేశాడు. స్వతంత్ర భారతావనికి అథ్లెటిక్స్లో తొలి పతకం అందించడమే కాకుండా మొట్టమొదటి పసిడి సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో భారత అథ్లెట్గా 24 ఏళ్ల నీరజ్ చరిత్ర పుటల్లోకెక్కాడు.
PV Sindhu Record: అలాగే బ్యాడ్మింటన్ సింగిల్స్లో కాంస్యం సాధించిన మన పీవీ సింధు.. రెండు ఒలింపిక్స్ పతకాలు (2016లో రజతం) దక్కించుకున్న తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డు నమోదు చేసింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పురుషుల హాకీ జట్టు పతకం (కాంస్యం) గెలిచింది. మహిళల హాకీ జట్టు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి, రెజ్లింగ్లో రవి కుమార్ రజతాలు, బాక్సింగ్లో లవ్లీనా, మరో రెజ్లర్ బజ్రంగ్ కాంస్యాలు నెగ్గడం వల్ల మొత్తం ఏడు పతకాలతో ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ పోటీలను ముగించింది.
ఇక అదే వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు దుమ్ములేపారు. వైకల్యాలను అధిగమించి పతకాల పంట పండించారు. ఐదు స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక పారాలింపిక్స్లో దేశానికి దక్కిన అత్యధిక పతకాలివే. అవని, మనీశ్ (షూటింగ్), సుమిత్ (జావెలిన్ త్రో), ప్రమోద్, కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్) చెరో పసిడి నెగ్గారు.
అపూర్వం
ఆస్ట్రేలియాను దాని దేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది వరుసగా రెండుసార్లు కంగారూలను దాని సొంతగడ్డపైనే టెస్టు సిరీస్ల్లో చిత్తు చేయడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ జట్టులోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లు దూరమైనా విజయం సాధించడమంటే అద్భుతమే. ఆ అద్భుతాన్ని అందుకుంది టీమ్ఇండియా. 2020-21 బోర్డర్ గావస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఆ టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. కానీ సారథ్యంలో పుంజుకున్న జట్టు రెండో టెస్టులో గెలిచింది. మూడో మ్యాచ్ డ్రా అయింది. ఇక జనవరిలో గబ్బాలో చివరి టెస్టుకు వచ్చేసరికి గాయాల కారణంగా జట్టులో ప్రధాన పేసర్లెవరూ లేకుండా పోయారు. దీంతో సిరాజ్ బౌలింగ్ దళాన్ని నడిపించాల్సి వచ్చింది. ఆ టెస్టులో సుందర్, శార్దూల్, సిరాజ్, పంత్ వీరోచిత ప్రదర్శనతో ప్రత్యర్థిని ఓడించిన టీమ్ఇండియా.. 32 ఏళ్ల తర్వాత ఆ వేదికలో ఆతిథ్య జట్టుకు తొలి ఓటమి రుచి చూపించి సిరీస్ దక్కించుకుంది. సెంచూరియన్లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో విజయంతో 2021ను ఘనంగా ముగించింది.
సంచలనం
Azaj patel Record: ఓ టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడాన్ని గొప్ప ప్రదర్శనగా చూస్తారు. అదే పదికి పది వికెట్లు తీస్తే సంచలనమే. ఈ ఏడాది ముందు వరకూ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇద్దరికి (జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే) మాత్రమే అది సాధ్యమైంది. కానీ 2021లో భారత్లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
ఏ క్రీడల్లోనైనా ప్రపంచ ఛాంపియన్షిప్లో ఒక్క పతకం సాధిస్తే ఆ ప్లేయర్ను ఆకాశానికెత్తేస్తాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పతకాలు గెలిస్తే.. అది కూడా ఒకే ఛాంపియన్షిప్లో నెగ్గింది.. మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ. ఈ ఏడాది సెప్టెంబర్లో యుఎస్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో ఆమె వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్, మహిళల జట్టు విభాగాల్లో రజతాలు నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్గా నిలిచింది.
భారత్లో మహిళల క్రికెట్కు మారుపేరుగా నిలిచిన మిథాలీ రాజ్ ఈ ఏడాది ఓ గొప్ప రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ టీమ్ఇండియా వన్డే కెప్టెన్.. తాజాగా అంతర్జాతీయ అమ్మాయిల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచింది. ఇంగ్లాండ్తో మూడో వన్డేలో ఆమె ఎడ్వర్డ్ (10,273)ను అధిగమించింది. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 321 మ్యాచ్లాడిన ఆమె 10,454 పరుగులు చేసింది.
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాది మరో సంచలనం నమోదు చేశాడు. ఆల్టైమ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈ పోర్చుగల్ ఆటగాడు 184 మ్యాచ్ల్లో 115 గోల్స్ చేశాడు. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి, మెస్సి చెరో 80 గోల్స్తో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.