తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2021, 10:57 AM IST

ETV Bharat / sports

Rewind 2021: ఈ ఏడాది వివాదాలు, విషాదాలు ఇవే!

Rewind 2021 Sports: టీ20 ప్రపంచకప్​లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన టీమ్ఇండియా.. బీసీసీఐ-విరాట్ కోహ్లీ వివాదం.. బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్​లో సింధుకు నిరాశ.. అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూత.. ఇలా ఈ ఏడాది భారత క్రీడల్లో వివాదాలు, విషాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.

rewind 2021, రివైండ్ 2021
వివాదాలు

Rewind 2021 Sports: ఈ ఏడాది తలెత్తుకునేలా చేసిన విజయాలే కాదు.. కన్నీళ్లు పెట్టించిన ఓటములూ ఉన్నాయి! నింగికి ఎగిసిన దిగ్గజాలు..! ఆందోళన కలిగించిన వివాదాలూ వార్తల్లో నిలిచాయి. ! ఇలా ఈ ఏడాదిలో చోటు చేసుకున్న చేదు జ్ఞాపకాలతో పాటు.. ! కాలగర్భంలో కలిసిపోతున్న 2021లో క్రీడల్లో కొన్ని ముఖ్య పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుందాం!

వివాదం

BCCI-Kohli controversy: ప్రశాంతంగా సాగిపోతున్న భారత క్రికెట్లో బీసీసీఐ, విరాట్‌ కోహ్లీ మధ్య వివాదం రేగింది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేసిన కోహ్లీ.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగుతానని చెప్పాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదని వన్డే నాయకుడిగా కోహ్లీపై వేటు వేసి రోహిత్‌నే ఎంపిక చేశారు. దీనిపై కోహ్లీకి ముందుగానే సమాచారం అందించామని బీసీసీఐ చెప్పింది. కానీ తనకు కేవలం గంటన్నర ముందు మాత్రమే చెప్పారని, టీ20 కెప్టెన్‌గా దిగిపోవద్దని తననెవరూ ఆపలేదని కోహ్లీ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశాడు.

వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో (2008లో కాంస్యం, 2012లో రజతం) పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఇప్పుడు తీహార్‌ జైళ్లో మగ్గుతున్నాడు. దిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో సుశీల్‌ నేతృత్వంలో జరిగిన దాడిలో యువ రెజ్లర్‌ సాగర్‌ చనిపోవడమే అందుకు కారణం. ఆ సంఘటన తర్వాత అదృశ్యమైన అతణ్ని పోలీసులు గాలించి పట్టుకున్నారు.

సుశీల్ కుమార్

Peng Shuai controversy: చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిపై లైంగిక హింస ఆరోపణలు చేసిన ఆ దేశ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఆరోపణల తర్వాత ఆమె కనిపించకపోవడం వల్ల ఆందోళన నెలకొంది. ఆమె ఆచూకీ కోసం టెన్నిస్‌ ప్రపంచంతో పాటు సాధారణ ప్రజానీకం కూడా గొంతెత్తింది. కానీ ఇటీవల తాను సురక్షితంగానే ఉన్నానని, ఎలాంటి లైంగిక హింస ఆరోపణలతో కూడిన పోస్టు పెట్టలేదని ఆమె పేర్కొనడం గమనార్హం. చైనా ఆమె గొంతు నొక్కుతుందని ఆరోపిస్తున్న మహిళల టెన్నిస్‌ సంఘం.. ఆమె ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశంతో పాటు హాంకాంగ్‌లోనూ డబ్ల్యూటీఏ టోర్నీలని నిలిపివేసింది.

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్‌ క్రీడాకారిణి మనికా బత్రా దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తాను వ్యక్తిగతంగా శిక్షణ ఇస్తున్న క్రీడాకారిణికి ప్రయోజనం కలగడం కోసం కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ తనను ఓడిపోవాలని ఒత్తిడి చేశాడని మనిక ఆరోపించింది. ఆమె ఆరోపణలపై విచారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది.

నిరాశ

టీమ్ఇండియా

Team India T20 Worldcup: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన భారత్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే వెనుదిరగడం కోట్లాది భారత ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. ప్రపంచకప్‌ (వన్డే, టీ20) చరిత్రలోనే తొలిసారి దాయాది పాకిస్థాన్‌ చేతిలో ఓటమితో టోర్నీ ఆరంభించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ పరాజయం చెందడం వల్ల సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. అంతకుముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ కివీస్‌ చేతిలో ఓడిన భారత్‌.. అభిమానులను నిరాశలో ముంచెత్తింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు, ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి తమ టైటిళ్లు కాపాడుకోలేకపోయారు. 2019 ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సింధు.. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జరిగిన పోటీల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. క్వార్టర్స్‌లోనే ఆమె ఇంటి ముఖం పట్టింది. ఇక ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో 2019లో టైటిల్‌ సాధించి సత్తాచాటిన హంపి.. ఈ సారి ఆరో స్థానానికే పరిమితమైంది.

మానసిక ఆందోళనలు

సిమోన్ బైల్స్

ఎప్పుడూ తమ ఆటతో అభిమానులను అలరిస్తూ.. విజయాలతో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు ఈ ఏడాది తమ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. దాని నుంచి కోలుకునేందుకు కొంత కాలం పాటు ఆటకు దూరమయ్యారు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో ఐదు విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలుస్తుందనే అంచనాలతో బరిలో దిగిన అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ 'ట్విస్టీస్‌' అనే మానసిక సమస్యతో టీమ్‌, ఆల్‌రౌండ్‌, వాల్ట్‌, అన్‌ఈవెన్‌ బార్స్‌, ఫ్లోర్‌ ఫైనల్స్‌ నుంచి తప్పుకుంది. చివరగా బ్యాలెన్స్‌ బీమ్‌లో పోటీపడి కాంస్యం గెలిచింది. క్రికెటర్లు స్టోక్స్‌, గేల్‌, టెన్నిస్‌ స్టార్‌ ఒసాక తదితరులు కూడా మానసిక ఆందోళన నుంచి కోలుకునేందుకు ఆట నుంచి కాస్త విరామం తీసుకున్నారు.

విషాదం

Milka Singh dead: భారత అథ్లెటిక్స్‌ రంగంలో చెరగని ముద్ర వేసి.. ట్రాక్‌పై తన అద్భుత పరుగుతో దిగ్గజంగా ఎదిగిన 'ఫ్లయింగ్‌ సిఖ్‌' మిల్కా సింగ్‌ ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ 400 మీటర్ల పరుగులో తృటిలో పతకం కోల్పోయిన ఆయన 91 ఏళ్ల వయసులో కరోనా దుష్పరిణామాల వల్ల తుదిశ్వాస విడిచారు. నాలుగు సార్లు ఆసియా క్రీడల స్వర్ణ విజేత తన జ్ఞాపకాలను మనకు వదిలేసి నింగికేగారు.

మిల్కా సింగ్

1983 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోని సభ్యుడు యశ్‌పాల్‌ శర్మ కూడా 2021లో ప్రాణాలు వదిలారు. ఉదయం నడక నుంచి ఇంటికి తిరిగొచ్చిన 66 ఏళ్ల ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. టీమ్‌ఇండియా తరపున ఆయన 37 టెస్టులు, 42 వన్డేలాడారు. భారత హాకీ దిగ్గజాలు ఎమ్‌కే కౌశిక్‌, రవీందర్‌ పాల్‌ సింగ్‌ ఒకే రోజు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు ఆసియా క్రీడల బాక్సింగ్‌ ఛాంపియన్‌ డింకూ సింగ్‌ కూడా ఈ ఏడాదే చనిపోయారు.

Rewind 2021: చారిత్రక విజయాలు.. అద్వితీయ రికార్డులు

Rewind 2021: విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు

ABOUT THE AUTHOR

...view details