ఆసియా జాతులపై విద్వేషం, స్త్రీ వివక్ష ట్వీట్లు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ శిక్ష అనుభవించాల్సిందేనని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఫరూక్ ఇంజినీర్ అన్నాడు. యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అతడికి మద్దతివ్వడాన్ని తప్పుపట్టాడు.
18 ఏళ్లంటే వ్యక్తిగతంగా బాధ్యతలు చేపట్టాల్సిన వయసని ఫరూక్ అన్నాడు. కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తు తరాలూ ఇలాగే చేస్తాయని పేర్కొన్నాడు. బ్రిటన్ ప్రధాని మాటలు యుక్త వయసు కాబట్టి ఎలాంటి తప్పులైనా చేయొచ్చన్న ధీమా ఇస్తున్నాయని విమర్శించాడు. అలాంటప్పుడు యువత ఆసియా జాతులపై వెకిలి అర్థాలతో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని అన్నాడు. ఒకప్పుడు లాంక్షైర్కు ఆడినప్పుడు తానూ జాతి వివక్షను ఎదుర్కొన్నానని వెల్లడించాడు.
"జీవితాంతం నిషేధించాలని నేననడం లేదు. కానీ ఏదో రకంగా కఠిన శిక్ష అనుభవించాల్సిందే. వారి డబ్బుకు కోతపడేలా భారీ జరిమానా విధించడమో, ఒక టెస్టు సిరీసు లేదా కొంత కాలం ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేయాలి. నేను తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు 'అతడు భారత్ నుంచి వచ్చాడా?' అని గుసగుసలు వినిపించాయి. లాంక్షైర్లో చేరినప్పుడు ఒకట్రెండు సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. మరీ వ్యక్తిగతమైనవి కావు కానీ కేవలం భారత్ నుంచి వచ్చినందుకే అలా అన్నారు. నా యాసను ఎగతాళి చేశారు. నిజానికి నా ఇంగ్లిష్ చాలామంది ఆంగ్లేయుల కన్నా మెరుగ్గా ఉంటుంది. త్వరలోనే వారికది అర్థమైంది. నేను వెంటవెంటనే ముఖం మీదే బదులిచ్చేవాడిని. ఇక కీపింగ్లోనూ అదరగొట్టాను. దాంతో ఫరూక్తో పెట్టుకోవద్దని వారికి తెలిసొచ్చింది"