Mumbai retention players: ఐపీఎల్లో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్(mumbai indians retention). ఈ సారి రిటెన్షన్ ప్రక్రియలో సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ట్రెంట్ బౌల్ట్ సహా పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. కాగా, పాండ్య బ్రదర్స్ను మెగావేలంలోనూ తీసుకోవడమే అనుమానమే. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. హార్దిక్, ఇషాన్ను రిటెయిన్ చేసుకోకపోవడంపై 'వి మిస్ యూ' అంటూ విపరీతంగా పోస్ట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రిటెన్షన్ పూర్తైన తర్వాత ఈ ప్రక్రియ గురించి సారథి రోహిత్ మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేసింది ముంబయి. ఇందులో హిట్మ్యాన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ముంబయికి రిటెన్షన్ ప్రక్రియ చాలా కఠినమైనది. మా దగ్గర ప్రస్తుతం అద్భత ఆటగాళ్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేయడం చాలా బాధేసింది. వాళ్లు జట్టు కోసం అద్భుతంగా ఆడారు. ఈ ఫ్రాంచైజీకి ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చారు. ఏదేమైనప్పటికీ మా రిటెయిన్ ప్లేయర్స్ సహా మెగా వేలంలో తీసుకునే ఆటగాళ్లతో కలిసి ముంబయి బలమైన జట్టుగా తయారవుతుందని ఆశిస్తున్నాను." అని అన్నాడు.