Retired out in IPL: ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతడు ఇలా వెనుదిరిగాడు. అలసిపోయి షాట్లు ఆటలేకపోతుండటం వల్ల అశ్విని వెనుదిరిగి ఉండొచ్చని అంతా భావించారు. రిటైర్డ్ ఔట్ అనేది ఓ వ్యూహాత్మక ఎత్తుగడ. మెరుగైన ముగింపు కోసం రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాటర్లో.. రిటైర్డ్ ఔట్ అయిన బ్యాటర్ తిరిగి బ్యాటింగ్ రావడానికి వీల్లేదు. అశ్విన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ ఓ సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ 23 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు.
చివరి ఓవర్లో అశ్విన్ మైదానం వీడటంపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అశంపై ట్విట్టర్ వేదికగా చర్చించారు. ఐపీఎల్లో తొలిసారి ఈ సంఘటనను చూశానని ఓ అభిమాని పోస్ట్ చేయగా.. ఇది వ్యూహంలో భాగమని మరో అభిమాని పేర్కొన్నాడు. అశ్విన్ స్థానంలో రియాన్ పరాగ్ రావటం.. గొప్ప వ్యూహంగా పలువురు పేర్కొన్నారు. మరో అభిమాని ఓ అడుగు ముందుకేసి రోహిత్ శర్మ కంటే అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేసినట్లు తెలిపాడు.
ఆర్ఆర్ కెప్టెన్ ఏమన్నాడంటే?: అశ్విన్ రిటైర్డ్ ఔట్గా వెళ్లటంపై మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. డెత్ ఓవర్లలో అశ్విన్ను రిటైర్డ్ ఔట్గా వెనక్కి పిలిపించటం.. జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు. మ్యాచ్ పరిస్థితిని అనుసరించి ఈ వ్యూహాన్ని అమలు చేశారని తెలిపాడు. తాము ఎప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, రిటైర్డ్ ఔట్ గురించి ముందే చర్చించినట్లు వెల్లడించాడు.